ఫేస్మాస్క్, భౌతిక దూరం నిబంధనలు పాటించాలి
కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: అన్లాక్4 సడలింపుల్లో భాగంగా 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ 21 నుంచి తరగతుల నిర్వహణకు పాక్షికంగా అనుమతి ఇస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగతాచోట్ల స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకొని పాఠశాలలను ప్రారంభించవచ్చునని మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నది. అయితే, కొవిడ్19 నియంత్రణకు హోంశాఖ రాష్ట్రాలకు జారీ చేసిన నిబంధనలను అనుసరించి పాఠశాలల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. పాఠశాలల పరిసరాల్లో ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. సబ్బుతో లేదా శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దు. తుమ్మినా, దగ్గినా టిష్యూ పేపర్ లేదా చేతి రుమాల్ అడ్డం పెట్టుకోవాలి. అనారోగ్య సమస్యలేమైనా ఉంటే వెంటనే తెలియజేయాలి. ఆరోగ్యసేతును ఇన్స్టాల్ చేసుకోవాలి. పాఠశాలలను తెరవడంపై స్థానిక ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఆరోగ్యశాఖ సూచించింది.
Central Govt to permission 9-12 schools open