న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో బుధవారం చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు కసరత్తు మొదలుపెట్టింది. రైతులతో చర్చలు జరపనున్న మంత్రులతో హోంమంత్రి అమిత్ షా మంగళవారం సమావేశమైనారు. అమిత్ షా నివాసంలో వ్యవసాయ మంత్రి తోమర్, పీయూష్ గోయల్లు ఆయనను కలిసి రైతు సంఘాల నేతలతో చర్చించాల్సిన అంశాలపై మంతనాలు జరిపారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై స్పందించే అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి ఈ నెల 30న చర్చలు జరుపుదామని కేంద్రం రైతు సంఘాలకు లేఖలు రాసింది. అందుకు రైతు సంఘాలు కూడా ఆమోదం తెలిపాయి. ఇదిలా ఉండగా సాగు చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగడం ఇది ఆరోసారి. ఇప్పటివరకు ఐదు దఫాలు చర్చలు జరిగినా అవి ఫలించలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, సవరణలు తీసుకు వస్తామని కేంద్రం అంటోంది. కాగా చర్చలు జరిగే రోజున కూడా అన్నదాతల ఆందోళన కొనసాగనుంది. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు బుధవారం ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నారు.
Centre Negotiations with farmers today