ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని అనేక మందికి నాణ్యమైన విద్య, వైద్యం క్రైస్తవ మిషనరీల ద్వారా అందిందని ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కొనియాడారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని షారోను చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ .. ‘దాసోజు ఫౌండేషన్’ నుంచి 84 మంది పాస్టర్లకు కానుకలు అందజేశారు. దాసోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ పాస్టర్స్ సోదరులందిరికీ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ‘కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది ఆత్మీయులను కోల్పోయాం. చాలా కష్టాలు పడ్డా.
కానీ దేవుని దయవల్ల మనం ఇక్కడ ఉన్నాం. ‘దాసోజు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో తోచిన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి స్ఫూర్తి.. ఏసు ప్రభువు. దేశలోని అనేక మందికి నాణ్యమైన విద్య, వైద్యం క్రైస్తవ మిషనరీల నుంచి అందింది. స్వయంగా నేను క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. ఈ రోజు ఈ స్థానంలో వున్నానంటే ఆ రోజు నేను పొందిన నాణ్యమైన విద్య అని గర్వంగా చెప్పుకోగలను’ అని పేర్కొన్నారు. క్రైస్తవ మిషనరీలకు అనేక సమస్యలు వున్నాయన్నారు. చర్చిలు నిర్మించాలన్నా.. స్మశాన వాటికల నిర్మాణంలోనూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. పాస్టర్లకు జీతభత్యాలు లేవన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని దాసోజు శ్రవణ్ మాటిచ్చారు. కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షలు శ్రీనివాస్ యాదవ్, కాటూరి రమేష్, ధనరాజు రాథోడ్, కమ్మరి వెంకటేష్, ఇందిరా రావు తదితర ఖైరతాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాస్త్రి, జాకీర్, ముజ్జులలా, అంజన్కుమార్, సలీం, ధర్మేందర్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.