Saturday, April 27, 2024

ప్రజా సమస్యలే ‘జెండా.. అజెండా’

- Advertisement -
- Advertisement -

CM KCR Announced BRS National Political Party

మన తెలంగాణ/హైదరాబాద్:భారత దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ప్రధాన ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ జండాను పట్టుకోని పోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆనాడు రాష్ట్ర సాధన కోసం తాను ఒక్కడినే బయలుదేరినప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఆశీర్వదించారని, అలాగే దేశాభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమం కోసం జాతీయ స్థాయి రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా మనతో కలిసి వస్తారన్న విశ్వాసం, ధీమా తనకుందన్నారు. రాష్ట్రానికి సిఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానని కెసిఆర్ పేర్కొన్నారు. కార్యక్షేత్రం వదలనని…. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కరలేదని స్పష్టం చేశారు. భారత్ ఉజ్వల దేశంగా తయారు కావాల్సిన అవసరమున్నది. మన దేశంలోని వనరులు.. మన దేశంలోనే వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామన్నారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీ పేరును ‘భారత రాష్ట్ర సమితి’ గా మార్చుతూ సిఎం కెసిఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని జయ జయ ధ్వానాలతో సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమానికి జెడిఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ దళిత నేత, ఎంపీ, విసికె అధినేత తిరుమావళవన్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా కొనసాగిన టిఆర్‌ఎస్‌పై ఇక బిఆర్‌ఎస్‌గా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కావాల్సిన సమయం ఉన్న నేపేథ్యంలో బిఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తామన్నారు. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటమని కెసిఆర్ తెలిపారు. మన జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘటనను మొదట మహారాష్ట్ర నుంచే ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశ చరిత్రలో స్థిర స్థాయిలో నిలిచిపోతుందన్నారు. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించిందన్నారు. ఈ సందర్భంగా తలెత్తుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలన్నారు. తెలంగాణలో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించామన్నారు. పల్లెలు పట్టణాలను శరవేగంగా అభివృద్ధి పరుచుకున్నామన్నారు. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యమన్నారు. ఒక అద్భుతమైన తాత్విక పునాదితో ముందుకు సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా సాగే క్రమంలో అందరి సహకారం అవసరమన్నారు. ఎట్లయితే పట్టుదలతో తెలంగాణ ప్రజలను గెలిపించినమో..అదే పద్దతిలో దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో మనం గెలిపిస్తామని సిఎం కెసిఆర్ అన్నారు.

ఎంచుకున్న కార్యాన్ని యజ్ఞంలా తీసుకున్నాం
ఏపని చేసినా అర్థవంతంగా ప్రకాశవంతంగా చేయాలని కెసిఆర్ అన్నారు. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృష్యంలో ప్రారంభమైన టిఆర్‌ఎస్ ప్రస్థానం…. నాటి సమైక్య పాలనలో కృంగి కృషించి పోయిన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపుల పెట్టుకోని ముందుకు సాగామన్నారు. రాష్ట్రాన్ని సాధించుకుని అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నామని కెసిఆర్ తెలిపారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమైతున్నవని పక్కరాష్ట్రాల వాల్లు ఆశ్చర్య పడుతున్నారన్నారు. ఎంచుకున్న కార్యాన్ని ఒక యజ్జంలా, దీక్షలాగా చేసుకుంటూ వచ్చామన్నారు. కాబట్టే ఇదంతా సాధ్యమైందన్నారు.

జాతీయ పార్టీ పెట్టలన్న నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదు
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దేశాన్నేలిన పార్టీలు గద్దెనెక్కడం.. గద్దె దిగడం తప్ప దేశానికి చేసిందేమిలేదని కెసిఆర్ విమర్శించారు. జై తెలంగాణ నినాదంతో మనమే ఉద్యమించి, నెత్తిన భారం పెట్టుకున్నామన్నారు. అనుకున్నది సాధించామని.. ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆట వంటిదని…. కానీ టిఆర్‌ఎస్ పార్టీకి అదొక టాస్క్ వంటిదన్నారు. తెలంగాణ అభివృద్ధికోసం కార్యకర్తల్లాగా మనం కమిట్మెంట్ తో పనిచేశామనేనారు. అంతగా కష్టపడ్డం కాబట్టే గొప్ప గొప్ప విజయాలు సాధించామన్నారు. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష రూపాయలు మాత్రమేనని… కాని ప్రస్తుతం రూ.2 లక్షల 78 వేలకు పెరిగిందన్నారు. రాష్ట్ర జిఎస్‌డిపి 2014లో 5 లక్షల 6 వేలుంటే నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నది. ఇంతటి అభివృద్ధిని సాధించడానికి మనం తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే.. దేశం కోసం కూడా మనం కష్టపడి పనిచేసి సాధించి చూపిద్దామన్నారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకుంటున్ననిర్ణయం కాదు… అన్నీ చేసి చూయించి బలమైన పునాదులమీదినించే నిర్ణయం తీసుకున్నామన్నారు.
భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని, రాష్ట్రాలు దేశం రెండు కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర జిఎస్‌డిపి వాస్తవానికి రూ. 14.5 లక్షల కోట్లు ఉండాల్సింది… కానీ హ్రస్వదృష్టితో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల ఇంకా కూడా అందుకోవాల్సినంత అభివృద్దిని విజయాలను తెలంగాణ అందుకోలేక పోతున్నదన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం సాగిన నాటి త్యాగాలు చాలా వరకు నెరవేరకుండానే పోయాయన్నారు.

లింగ, కల వివక్షలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి
రెండు ముఖ్యమైన వివక్షలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని కెసిఆర్ అన్నారు. ఒకటి లింగ వివక్ష కాగా… రెండోది కుల వివక్ష అని అన్నారు. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడం వల్ల నష్టం జరుగుతున్నదన్నారు. అదే సందర్భంలో దేశ జనాభాలో 20శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారన్నారు. అటు మహిళా శక్తి, ఇటు దళిత శక్తి నిర్వీర్యం కావడ్డ వల్ల అభివృద్ధి జరగట్లేదన్నారు. అదే సందర్భంలో పేదరికం పేరుతో అగ్రవర్ణాలని చెప్పబడే వారిలో కూడా ఎందరో అవకాశాలను కోల్పోతున్నారన్నారు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదన్నారు. స్థూలమైన విషయాల్లో మౌలిక మైన మార్పు రాకుండా సమాజిక పరిస్థితుల్లో మార్పు రావడం సాధ్యం కాదన్నారు.

ఆ దేశాల్లో అద్భుతాలు జరిగాయి..
ఏ దేశాలైతే సమాజాన్ని వినూత్న పంథాలో నడిపిస్తాయో, అటువంటి దేశాలే గుణాత్మకంగా మారాయని కెసిఆర్ అన్నారు. మార్పుకోరుకోని సమాజాలు మారలేదన్నారు. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయన్నారు. 1980 వరకు చైనా జిడిపి మన దేశం కన్నా తక్కువగా ఉండేదన్నారు. 16 ట్రిలియన్ డాలర్ల ఎకనామితో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. సౌత్ కొరియా, జపాన్, మలేసియా వంటి దేశాల్లో అద్భుతాలు జరిగాయన్నారు.

దళిత జనోద్ధ్దరణ కోసమే దళితబందు
దళిత బంధు అనేది ప్రత్యేకంగా దళిత జనోద్ధరణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమని కెసిఆర్ అన్నారు. సమాజంలోని ఇతరులకు అందే అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు దళితులకు కూడా అందుతున్నాయన్నారు. వాటితో పాటు దళిత బంధు పథకం వారికి అధికమన్నారు. ఇది వారి అభివృద్ధి కోసమే అమలు చేస్తున్న ప్రత్యేక పథకమన్నారు. రాష్ట్రంలోని 8 లక్షల 40 వేల కుటుంబాలకు దళిత బంధు, రైతుబంధు, రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ఇదే విషయాన్ని ఇక్కడకు వచ్చిన ప్రముఖ దళిత నాయకులు ఎంపీ తిరువలన్‌కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. రాష్ట్రంలో 17లక్షల 50వేల దళిత కుటుంబాలున్నాయి. వారందరికీ దశల వారీగా దళిత బంధును అందిస్తూ బాగుచేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.

వినూత్న కార్యక్రమాలతో తెలంగాణలో అభివృద్ధి
రాష్ట్రంలో అమలవుతున్న వినూత్నఆవిష్కరణలు దేశ స్వాతంత్య్రం వచ్చిన తొలినాల్లలోనే అమలు చేసి ఉంటే బాగుండేదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. మనం అవుటాఫ్ బాక్స్ నుంచి ఆలోచన చేసి వినూత్న కార్యక్రమాలను ఆవిష్కరించినందువల్లే కాబట్టే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు. దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగమన్నారు. దేశంలోని రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెల్ల కాలం పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణమని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా అనేక పార్టీల నుంచి మద్దతు ఉంది
టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చుతూ తలపెట్టిన చారిత్రక కార్యక్రమానికి యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లు వస్తామన్నారు. కానీ వారి వారి పరిస్థితులను అర్థం చేసుకుని తానేవద్దన్నాను. ఇది కేవలం పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమేనని న్నారు. తదనంతరం పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పిలుస్తామన్నారు. బిఆర్‌ఎస్‌తో ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమానికి మాజీ భారత ప్రధాని దేవగౌడ గట్టి మద్దతు ఇప్పటికే ఇచ్చారన్నారు. అలాగే జెడిఎస్ పార్టీకి కూడా సంపూర్ణ మద్దతుంటుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణలతో అనేక చర్చలు చేశామన్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు లో వారి సలహాలు తీసుకున్నామన్నారు.

వనరులుండీ…సద్వినియోగం చేసుకోని పరిస్థితి
దేశంలో ఆపార వనరులుండీ కూడా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది శోచనీయమన్నారు. ఈ పద్దతి మారాలన్నారు.మనమే మార్చాలన్నారు. మన రాష్ట్రాన్ని ఎలా అయితే బాగుచేసుకున్నామో…మన దేశాన్ని కూడా మనం బాగుచేసుకోవాలన్నారు. ఈ దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన సాగు భూమి ఉందని…పుష్కలంగా నీరుందన్నారు. కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. అందుకే దేశమే ప్రపంచానికే అన్నం పెట్టాలి…. పలు రకాలనై పంటలను పండించి ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నారు. అది వదిలి మనమే పిజ్జాలు బర్గర్లు తినడం అంటే అవమానకరమన్నారు.

రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చినట్లు… దేశమంతా ఇవ్వలేమా?
మనం ఛాలెంజ్ గా తీసుకుని మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికి నల్లాలతోని నీల్లు ఇచ్చినట్టు భారత దేశమంతా ఇవ్వలేమా? అని కెసిఆర్ ప్రశ్నించారు. దేశమంతా చాలా సులువుగా ఇవ్వొచ్చునని అన్నారు. దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా నీల్లను అందిస్తామన్నారు. ఇందుకు చైనా, పాకిస్తాన్, అమెరికా దేశాలతో యుద్దం చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం చిత్తశుద్ది ఉంటే చాలన్నారు. శుద్ది చేసిన మంచినీల్లను దేశమంతా అందించగలమన్నారు. ఈ సమావేశంలో కూర్చున్న వాల్లంతా తెలంగాణ సాధించిన యోధులు…వీరు అదే స్పూర్తితో దేశ సేవ చేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు.

కెసిఆర్ విజనరీ, ఛాలెంజింగ్, లెజండరీ లీడర్
దేశాభివృద్ధి కోసం మీరు (కెసిఆర్) కంటున్న పారదర్శక కల సాకారం కావాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని జెడిఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి అన్నారు. దేశ నిర్మాణానికి కెసిఆర్ అవసరమైన విజనరీ లీడర్, ఛాలెంజింగ్ లీడర్, లిజెండరీ లీడరన్నారు. తెలంగాణలో విజయవంతమైన మీ పనితీరును తాము గమనిస్తున్నామన్నారు. ఇందులో మీరు సంపూర్ణ విజయం సాధించారన్నారు. అందుకే మేము ఇక్కడి వచ్చామన్నారు. కేంద్రంలో గత ఏడేండ్ల కాలంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. దానికి గట్టి సమాధానం చెప్పేందుకు మీరు ర్ నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అయితే అది రాజకీయ ప్రతీకార భావనతో కాకుండా అభివృద్ధి ద్వారా, దేశ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి మీరు చేస్తున్న కృషికి తమ సంపూర్ణ మద్దతుంటుందన్నారు. భవిష్యత్ రాజకీయ జీవితంలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
దళితులు, రైతుల పట్ల సిఎం కెసిఆర్ ఉన్న కమిట్ మెంట్ చాలా గొప్పదని అన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణలో మంచి విజయం సాధించారని ప్రశంసించారు. ఇది గొప్ప విషయమన్నారు. తెలంగాణ కోసం మీరు (కెసిఆర్) ఎంతగా పోరాటం చేశారో…. మాకు తెలుసన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అదే పద్దతిలో దేశ వ్యాప్తంగా కూడా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే మీ కలలను సాకారం చేసుకున్నారు. ఇప్పుడు దేశాభివృద్దిని సవాలుగా తీసుకున్నారన్నారు. మీ హృదయాంతరాల్లోంచి సాగిన ప్రసంగంలో పేదలు బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న నిబద్దతను తెలియజేసిందన్నారు. దళితులు, రైతుల అభివృద్దిని తెలంగాణలో పెద్ద ఎత్తున మీరు సాధించారు. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం దేశ నిర్మాణం కోసమే కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా విస్తరించాలని కోరుకున్నారు.

కెసిఆర్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది
కెసిఆర్ పూర్తిగా ప్రత్యేకతలు కలిగిన నాయకుడని ప్రముఖ దళిత నేత, ఎంపీ, విసికె అధినేత తిరుమావళవన్ అన్నారు.
తన ఆలోచనలు, పని విధానం, పోరాటాలు, విజయాలు, అన్నీ కూడా దేనికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. భారత దేశ ప్రజల కోసం సాధించేందుకు ముందడుగు వేస్తున్న కెసిఆర్‌కు విసికే పార్టీ తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. మీరు ఈ దేశానికి ఒక రోల్ మోడల్ అన్నారు. దేశంలో మరే సిఎంకు కూడా దళితుల కోసం గిరిజనుల కోసం రైతుల కోసం ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దళిత బంధు, రైతుబంధు పథకాలు కూడా విప్లవాత్మకమైనవన్నారు. పార్టీ పేరును పరిణామం చేయడం అనే నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న సమయ స్పూర్తితో కూడిన, తెలివైన, స్కాలర్లీ నిర్ణయంగా అభివర్ణించారు. తెలంగాణను సాధించినట్టే…. భారత దేశ అభివృద్ధిని కూడా కెసిఆర్ సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇది తనకు ప్రత్యేకమైన మరిచిపోలేని రోజున్నారు. టిఆర్‌ఎస్…బిఆర్‌ఎస్‌గా మారిందన్నారు. ఇది కేవలం పేరు మార్పు కాదు… టి నుంచి బికి జరిగే పరిణామ క్రమమన్నారు. టి అంటే టార్చ్.. బి అంటే బ్రైట్. మీకు అధ్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు.
అనంతరం ఆ పార్టీ తరఫున తిరుమావళవన్ సందేశాన్ని చదివారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాల సాధికారతకోసం పాటు పడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాను. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం గొప్ప విషయం అందుకు అభినందనలు. ఇదే స్పూర్తితో భారత పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాము. తెలంగాణలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కెసిఆర్‌కు కృతజ్జతలు. రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, విప్లవాత్మక కార్యాచరణతో కూడిన పథకాలను కెసిఆర్ అమలు చేస్తున్నారు. ఇందులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. అందుకు మీకు కృతజ్జతలు తెలుపుతున్నామన్నారు.

హాజరైన వివిధ రాష్ట్రాల నేతలు
టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సందర్భంగా కెసిఆర్ ఆహ్వానం కర్నాటక నుంచి ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ జనతాదళ్ (ఎస్) ముఖ్యనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వారితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తదితర ప్రజా ప్రతినిధుల బృందం హాజరైంది. అదే విధంగా తమిళ నాడు నుంచి ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (విసికె)పార్టీ అధినేత ‘చిదంబరం పార్లమెంట్ సభ్యుడు’, ప్రముఖ దళిత నేత తిరుమావళవన్., వారితో పాటు వచ్చిన ప్రతినిధుల బృందం హాజరైంది. కాగా ప్రగతిభవన్‌కు వచ్చిన ఆ బృందాలను టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్, పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొని వారికి ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, టిఆర్‌ఎస్ శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు హాజరయ్యారు.

CM KCR Announced BRS National Political Party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News