Wednesday, May 1, 2024

పివికి ‘వంద’నం

- Advertisement -
- Advertisement -
CM KCR High Level Review on PV Jayanthi Celebrations

 

పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి. పివితో అనుబంధం ఉన్న జాతీయ స్థాయి నాయకులతో పాటు ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతులను ఉత్సవాల్లో భాగస్వాములయ్యేలా చేద్దాం.
దేశం గర్వించదగ్గ నాయకుడికి ఏడాది పొడవునా శతజయంతి ఉత్సవాలు
ఆయనకు భారతరత్న ఇవ్వాలి
అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం
స్వయంగా ప్రధానిని కలిసి కోరుతా
ఉత్సవాల నిర్వహణకు రూ.10కోట్లు విడుదల
ఐదు చోట్ల (హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగర, ఢిల్లీలోని తెలంగాణ భవన్) కాంస్య విగ్రహాలు
హైదరాబాద్‌లో పివి మెమోరియల్, అసెంబ్లీలో చిత్రపటం
28న జ్ఞానభూమిలో ఉత్సవాలకు సిఎం కెసిఆర్ శ్రీకారం
కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మంత్రి కెటిఆర్‌కు అప్పగింత
పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలనుగాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆయనకు భారత రత్న ఇవ్వాలని సిఎం కెసిఆర్ కోరారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. ప్రధాని నరేంద్రమోడిని కలిసి తానే స్వయంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సిఎం పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారంతా గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. పివి జన్మదినమైన ఈ నెల 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో నిర్వహించే ప్రధాన కార్యక్రమంతో శతజయంతి ఉత్సవాలు ప్రారఁభం అవుతాయని వెల్లడించారు.

అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామన్నారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె వీణాదేవి, సిఎంఒ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

పివి శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏఏ కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉందన్నారు. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసే విధంగా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలన్నారు. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో పివి ఐదు కాంస్య విగ్రహాలను నెలకొల్పేందుకు వెంటనే ఆర్డర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర అసెంబ్లీలో పివి చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ నిర్ధేశించారు.

హైదరాబాద్‌లో పివి మెమోరియల్ ఏర్పాటు

రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్ లో పివి మెమోరియల్ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఇందుకు కెకె నేతృత్వంలోని కమిటి సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి పివి మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలన్నారు. వివిధ సందర్భాలకు సంబంధించిన పివి ఫోటోలను సేకరించడంతో వాటిని భద్రపరచాలన్నారు.. ఫోటో ఎగ్జిబిషన్ లు నిర్వహించాలని సూచించారు.  పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి తాను శ్రీకారం చుట్టనున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పరిమిత సంఖ్యతో జరుగుతుందన్నారు.

ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జన్మదిన వేడుకలు జరపాలన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణను మంత్రి కెటిఆర్‌కు అప్పగిస్తూ నిర్ణయించినట్లు తెలిపారు. పివికి మన రాష్ట్రంతోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాలతో కూడా అనుబంధం ఉందన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా కూడా అనేక మందితో అనుబంధం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అనేక మంది అనుచరులు, సహచరులు, అభిమానులు ఉన్నారన్నారు ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనతో అనుబంధం కలిగిన వారున్నారు… కాబట్టి పివి జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించాలి. ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా నిర్వహించాలనే విషయంలో కార్యాచరణ రూపొందించాలని సిఎం సూచించారు.

ప్రత్యేక సావనీర్ తీయాలి

బహుముఖ ప్రజ్ఞాశాలి,. స్వతంత్య్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడుగా, జర్నలిస్టుగా, బహుభాషా కోవిదుడుగా, రచయితగా పివి విశేష సేవలందించారన్నారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక సావనీర్ తీయాలని సిఎం సూచించారు. సావనీర్ మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో చేసిన కృషి, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో ప్రత్యేక సంచికలు రావాలని అభిలాషించారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి. పివికి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? పివి తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది? అనే విషయాలను పొందు పరుస్తూ ప్రత్యేక సంచిక రావాలి. ఆర్థిక నిపుణులతో వ్యాసాలు రాయించాలన్నారు. విద్యారంగంలో కూడా పివి ఎంతో కృషి చేశారన్నారు. సర్వేల్‌లో మొదటి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారన్నారు. అది దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికిందని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు.

దేశ వ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారన్నారు. ఇలా లా విద్యారంగాభివృద్ధికి చేసిన కృషిని వివరించే విధంగా రచనలు చేసిన నేపథ్యంలో ఆయనపై ప్రత్యేక సంచిక తీసుకురావాల్సిన అవసముందన్నారు. దేశ వ్యాప్తంగా పివి అభిమానులు, అనుచరులున్నారు. వారందరినీ సంప్రదించి..వారి సూచనలు తీసుకోవాలన్నారు. వారి అభిప్రాయాలను సావనీర్, ప్రత్యేక సంచికల్లో పొందు పరచడంతో పాటు జయంతి ఉత్సవాల్లో వారిని భాగస్వాములను చేయాలన్నారు. అలాగే హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్, కరీంనగర్, మంథని, బరంపురం, నాగపూర్ తదితర నగరాల్లో పివి కాలం గడిపారని ఆయా సందర్భాల్లో ఆయనతో గడిపిన వారు, ఆయనతో అనుబంధం ఉన్నవారు ఉంటారన్నారు. వారిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా పివికి అనుబంధం ఉందని అభిప్రాయాలు కూడా సేకరించడంతో పాటు వీలైతే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలన్నారు.

దేశం గర్వించదగ్గ నాయకుడు

పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడని సిఎం అన్నారు. దేశ గతిని మార్చిన గొప్పవారుగా కీర్తించారు. యావత్ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం చెప్పే విధంగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడిలను శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానాలకు కూడా పంపుదామన్నారు. . వారు పాల్గొనే కార్యక్రమాలు ఎలా ఉండాలో డిజైన్ చేయాలి. అలాగే భారత పార్లమెంటులో పివి చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పివికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి. పివి గొప్ప సాహితీవేత్తతో పాటు అనేక భాషలపై పట్టున్న పండితుడన్నారు. అనేక రచనలు చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పివి రాసిన పుస్తకాలను తిరిగి ముద్రించాలని ఆదేశించారు. అముద్రితంగా ఉన్న వాటిని ముద్రించాలి. వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఈ బాధ్యతను సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ తీసుకుంటుందని పేర్కొన్నారు.

పెద్దఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి

పివి గొప్పతనం దేశానికంతా తెలిసేలా దేశ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ సూచించారు. ఢిల్లీ, కలకత్తా, చెన్నయ్, బెంగులూరు తదితర నగరాల్లో హోర్డింగులు పెట్టాలన్నారు. హైదరాబాద్ లో కనీసం 100 చోట్ల హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పివి స్మారక అవార్డు నెలకొల్పడంతో పాటు క్రమం తప్పకుండా అవార్డులు ఇవ్వాలన్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభం అయిన తర్వాత విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఊరికి పివి గొప్పతనం తెలిసేలా, ప్రజలంతా పివి ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు అందులో భాగస్వాములు కావాలన్నారు. పివి తెలుగువాడు…తెలంగాణ వాడన్నారు. జర్నలిస్టు. సాహితీవేత్త కాబట్టి పివికి ఘనమైన అక్షర నివాళి అర్పించే విధంగా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలన్నారు. కవులు పాటలు రాయాలని, అలాగే పత్రికలు ప్రత్యేక వ్యాసాలు ప్రచురించాలని కోరుతున్నానని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News