Monday, April 29, 2024

పరిశ్రమల ప్రగతిలో మనమే టాప్

- Advertisement -
- Advertisement -

Telangana Top in Industry Progress

 

జాతీయ జిఎస్‌డిపి సగటుతో పోల్చుకుంటే
8.2 శాతంతో రాష్ట్రం వార్షిక వృద్ధి నమోదు
జిడిపిలో తెలంగాణ వాటా 2019 20
సంవత్సరానికి 4.76 శాతంగా నమోదు
తలసరి ఆదాయంలోనూ తెలంగాణదే పైచేయి
ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్ర వాటా
ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం తెలంగాణదే
పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదిక
విడుదల చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రధానంగా ఐటి, ఇండస్ట్రీస్ రంగంలో మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతోందన్నారు. చివరకు కేంద్రం కూడా ఆశ్చర్యపడేలా తెలంగాణ రాష్ట్రం శరవేగంగా పురోగతి సాధిస్తోందన్నారు. జాతీయ జిఎస్ డిపి సగటుతో పోల్చుకుంటే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందన్నారు. జాతీయ జిడిపిలో రాష్ట్ర వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019-2020 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదు అయిందన్నారు.

తలసరి (ఫర్ క్యాపిట) ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు రూ. 1,34,432లతో పోల్చినప్పుడు తెలంగాణ పర్ క్యాపిట ఆదాయం రూ. 2,28,216లుగా నమోదైందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇక దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కెటిఆర్ విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో కలిసి ఈ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా నివేదికలో పలు అంశాల వారీగా పరిశ్రమల శాఖ సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.

టియస్ ఐపాస్:

ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక టిఎస్..ఐపాస్ విధానం అద్భుతమైన ఫలితాలను అందించిందన్నారు. ముఖ్యంగా ఇఒడిబి ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటి దాకా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల మొత్తం సంఖ్య రూ. 1,96,404 కోట్లుగా నమోదైందని అన్నారు. కాగా అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. రానున్న రోజుల్లో సుమారు రూ. 45,848 కోట్ల

పెట్టుబడులు తెలంగాణకి మెగా ఇన్వెస్ట్‌మెంట్

ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని తెలిపారు. తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇక భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్ సార్ ప్షన్(absorption) విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ నగరం జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరంగా మరోసారి ప్రథమ ర్యాంకు సాధించిందన్నారు.

బెస్ట్ పెర్ఫామింగ్ స్టేట్ గా నీతి ఆయోగ్ ద్వారా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండియా ఇండెంక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలోనూ పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్నారు. కరోనా రిలీఫ్ ఫండ్ కోసం సుమారు రూ. 150 కోట్లకు పైగా నిధులు లేదా ఇతరత్రా కాంట్రిబ్యూషన్ రూపంలో అందించారన్నారు.

ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో సాధించిన ప్రగతి

ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకొని జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తన వాటాను 35 శాతంగా కొనసాగించిందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ప్రస్తుతం సుమారు ఎనిమిది వందల ఫార్మా, బయోటెక్, మెడికల్ టెక్నాలజీ కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. తద్వారా వీటి యొక్క ఎంటర్‌ప్రైజ్ విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉన్నదన్నారు. రానున్న దశాబ్దకాలంలో దీని విలువను 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతోపాటు నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇక నోవార్టిస్ తన డిజిటల్ ఇన్నోవేషన్ హబ్ హైదరాబాద్లో ప్రారంభించిందన్నారు.

అలాగే ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీ పరిశ్రమకు ఎస్‌ఎంటి కంపెనీ పునాది వేసిందన్నారు. రూ. 250 కోట్లతో 20 ఎకరాల్లో మెడికల్ డివైస్ పార్క్‌లో ఈ పరిశ్రమ రానున్నదన్నారు. దీని ద్వారా 1500 మందికి నేరుగా ఉపాధి లభించనుందన్నారు. సింజిన్ కంపెనీ జీనోమ్ వ్యాలీలో రూ. 170 కోట్లతో తన పరిశ్రమను స్థాపించిందన్నారు. 1,80,000 స్క్వేర్ ఫీట్‌లలో వివిధ కంపెనీలను ఒకేచోట చేర్చేందుకు రూ. 100 కోట్ల పెట్టుబడితో ఎంఎన్ పార్క్ బిల్డింగ్ కోసం జినోమ్ వ్యాలీలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందన్నారు.

దీంతో హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తున్నదన్నారు. ఇప్పటికే 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. శాండజ్, సింజిన్, టిసిఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా ఇలాంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. కాగామెడికల్ డివైస్ పార్క్ లో సుమారు 25 కంపెనీలు తమ కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు.హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (నిమ్జ్) గుర్తింపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్‌లో

కేంద్ర సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టార్‌కి సంబంధించి మన రాష్ట్రం అవార్డు అందుకున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే మూడవ గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుందన్నారు. నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ సుమారు ఐదు డిఫెన్స్ ప్రాజెక్టులను హైదరాబాద్ తీసుకురావడం ద్వారా ఆరు వందల మందికి ఉపాధి కల్పించిందన్నారు. రెండు లక్షల 40 వేల చదరపు అడుగులతో రూ. 350 కోట్లతో జిఎంఆర్ బిజినెస్ పార్క్ ని శంషాబాద్ లో ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగం

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు ఏడు ఇంటిగ్రేటెడ్ కోల్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఒక మెగా ఫుడ్ పార్క్ కార్యకలాపాలు రూ. 300 కోట్లతో ప్రారంభమయ్యాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు పనులు ప్రారంభించాయన్నారు.

హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్స్

సిరిసిల్లలో 60 ఎకరాల్లో అప్పారెల్ పార్క్ ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని మంత్రి కెటిఆర్ అన్నారు. దీంతో పాటు మరో వీవింగ్ పార్క్ సిరిసిల్లలో అభివృద్ధి చేయడం జరుగుతున్నదన్నారు. ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 88 ఎకరాల్లో 50 ఇండస్ట్రియల్ షెడ్ల నిర్మాణం చేయడం ద్వారా 4416 పవర్‌లూమ్‌లు, 60 వార్పిన్ యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. అలాగే కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కులో సుమారు రూ. 960కోట్లతో 300 ఎకరాల్లో తమ కంపెనీని పెట్టేందుకు యంగ్‌వన్ కంపెనీ తుది దశ ఒప్పందాన్ని ప్రభుత్వంతో కుదుర్చుకుందన్నారు. దీని ద్వారా 12 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

చందన్‌వెళ్లిలో వెల్ స్పన్ గ్రూపు రూ.1150 కోట్లతో కేవలం 14 నెలల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఫలితంగా వెయ్యిమందికి ఉపాధి లభించిందన్నారు. అలాగే గణేశా ఇకోస్పియర్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నదన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లో రూ. 327 కోట్లతో 30 ఎకరాల్లో 1000 మంది ఉపాధి ఇచ్చేందుకు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. నేతన్నకు చేయూత ద్వారా రూ. 50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దీని ద్వారా 20,298 మంది కి నేతన్నలకు లబ్ధికలిగిందన్నారు. చేనేత మిత్ర ద్వారా 36, 233 మంది చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగిందన్నారు.

రిటైల్ రంగం

20 వేల చదరపు అడుగులతో గచ్చిబౌలిలో రాష్ట్రంలోనే అతి పెద్ద అమెజాన్ లార్జెస్ట్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. అమెజాన్ ఇప్పటికీ 3.2 మిలియన్ల క్యూబిక్ ఫీట్ల స్టోరేజీ కలిగిన మూడు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లు ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్రంలో వాల్ మార్ట్ తన 5వ స్టోర్‌ను వరంగల్లో ప్రారంభించిందన్నారు. సుమారు రూ. 13 కోట్లతో 7 ఎకరాల్లో కంటైనర్ ఫ్రీట్ స్టేషన్ ప్రారంభమైందన్నారు.

ఇతర అంశాల్లో

తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో సుమారు 18 ఎంఎస్‌ఎంఇలను రివైవ్ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ… న్యూజెర్సీ మధ్య సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ 2019 సెప్టెంబర్‌లో కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ ఒప్పందం వల్ల
ఐటి, ఫార్మా, లైఫ్ సైన్స్, బయోటెక్, మెడికల్, మీడియా వంటి వివిధ రంగాల్లో భాగస్వామ్యానికి ఒప్పందం కుదిరిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం వరంగల్, హైదరాబాద్ నగరానికి ఇవి ఛార్జింగ్ స్టేషన్లను కేటాయించిందన్నారు. అమెరికా కంపెనీ కట్టేరా(kattera) ఆఫ్ సైట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ని షాబాద్ లో ఏర్పాటు చేస్తున్నదని వెల్లడించారు. సుమారు రూ. 700కోట్లతో చేస్తున్న ఈ కంపెనీ ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News