హైదరాబాద్: సిఎం కెసిఆర్ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు 44 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, మార్కెట్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లోనూ బిసిలకు ప్రాధాన్యమిస్తున్నారని తెలియజేశారు. బిసిలకు ప్రత్యేక శాఖ ఉండాలని, సిఎ కెసిఆర్ ఎన్నో సార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారని, నియోజకవర్గానికి బిసి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని, ఆర్థిక మాంద్యంలోనూ సంక్షేమానికి ఎక్కడా లోటు రానివ్వలేదన్నారు. బిసిలు ఆత్మగౌరవంతో బతికేందుకు సిఎం కెసిఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని, గత పాలకుల హయాంలో తిండి కోసం ధర్నాలు చేశారని, కెసిఆర్ పెద్ద మనసుతో హాస్టళ్లలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు మెచ్చుకుంటున్నారని, ప్రజలందరూ సిఎం కెసిఆర్ వెంటే ఉన్నారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.