Saturday, April 27, 2024

చకచకా యాదాద్రి పనులు

- Advertisement -
- Advertisement -

CM KCR inspects construction work of Yadadri temple

మార్చి 28న ఆలయ పునఃప్రారంభోత్సవ నేపథ్యంలో తుది దశ
నిర్మాణ పనులను పరిశీలించిన సిఎం కెసిఆర్

నిర్మాణ పనులు త్వరగా
పూర్తిచేయాలని ఆదేశం
మహా సుదర్శనయాగం,
మహాకుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లపై
సమీక్ష దివ్యక్షేత్రం ఆలయ పనులపై
సిఎం ఆరా హెలికాప్టర్ నుంచి
గుట్ట పరిసరాల పరిశీలన
కల్యాణకట్ట పుష్కరిణి పనులను
పరిశీలించిన సిఎం
మార్చి 21న 75 ఎకరాల విస్తీర్ణంలో
మహా సుదర్శన యాగం

మనతెలంగాణ/హైదరాబాద్/యాదాద్రి భువనగిరి: వచ్చే నెల యాదాద్రి ఆలయం పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో యాదాద్రి దివ్యక్షేత్రం పనుల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్ష జరిపారు. మార్చి 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పనులతో పాటు మహా సుదర్శనయాగం, మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సోమవారం చర్చించారు. మార్చి 28వ తేదీన జరగనున్న మహాకుంభ సంప్రోక్షణ జరగనున్న దృష్టా పనుల గురించి అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులు, ఇతర నిర్మాణాల పురోగతిపై అధికారులకు సిఎం దిశానిర్ధేశం చేశారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి హెలికాప్టర్‌లో చేరుకున్న సిఎం ముందుగా విహాంగ వీక్షణం చేశారు. హెలికాప్టర్ నుంచి యాదాద్రి పరిసరాలను గమనించారు. అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్నారు.

బాలాలయంలో లక్ష్మినారసింహుడికి పూజలు రు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి ముఖ్యమంత్రికి స్వామి వారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ఈఓ స్వామివారి ప్రసాదాన్ని సి ఎంకు అందజేశారు. పనులను త్వరిగతగిన పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. నారసింహుని దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధానాలయం, గర్భగుడి, కల్యాణకట్ట, పుష్కరిణి నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సిఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

పనుల పురోగతిపై సమీక్ష

కొండ కిందకు చేరుకున్న ముఖ్యమంత్రి కల్యాణకట్ట, గండి చెరువు సమీపంలో లక్ష్మిపుష్కరిణి పనులను పరిశీలించారు. మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహాసుదర్శన యాగ స్థలాన్ని ఇప్పటికే చదును చేయగా ముఖ్యమంత్రి దానిని పరిశీలించారు. అన్నదానం కాంప్లెక్స్, సత్యనారాయణ వ్రతాలు, దీక్షాపరుల మండపాలు, బస్టాండ్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పుష్కరిణి వద్ద స్నానపుగదుల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. యాదాద్రి వలయ రహదారిపై కాన్వాయ్ దూసుకెళ్తుండగా చుట్టూ పచ్చదనాన్ని వీక్షిస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగారు. రాష్ట్రపతి తదితర వివిఐపిల ప్రెసిడెన్షియల్ కాటేజీలకు ఆయన వెళ్లారు. అనంతరం కొండపైకి చేరుకున్న సిఎం సుదర్శనయాగం, మహా కుంభ సంప్రోక్షణపై అధికారులతో సమీక్ష జరిపారు. సుదర్శన యాగంలో 1108 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గుండానికి ఆరుగురి చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్విక్కులు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి యాదాద్రి పునఃప్రారంభ వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు , పీఠాధిపతులు, లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

ముగింపు దశకు పనులు

ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. యాదాద్రి ప్రధానాలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు చేపట్టిన బంగారు తాపడం పనులు చివరి దశలో ఉన్నాయి. కొండపైన ఉత్తరదిశలో రక్షణగోడ, బస్బే, దర్శన వరుసలు, స్వాగతతోరణం నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నెలాఖరులోగా పనులన్నీ పూర్తి కాగలవని యాడా అధికారులు చెబుతున్నారు. రెండో కనుమ దారి అనుసంధానం నిర్మాణం తుది దశకు చేరింది. కొండ కింద ఆలయ వనరుల ఏర్పాట్లు చేపట్టారు. పుణ్యస్నానాల కోసం లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, తలనీలాల సమర్పణకు కల్యాణకట్ట నిర్మాణాలు పూర్తయ్యాయి.

ముస్తాబవుతున్న యాదాద్రి

యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు భక్తిభావం ఉట్టిపడేలా స్వర్ణకాంతులీనుతోంది. కొండపైన, దిగువన పచ్చదనం పరచుకుని ప్రకృతి సోయగాలు సంతరించుకున్నాయి. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు ఇంకా నెలన్నర మాత్రమే మిగిలి ఉండగా చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణం తో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి. సిఎం పర్యటనతో మిగిలి ఉన్న పనుల్లోనూ మరింత వేగం పుంజుకోనున్నాయి.

కల్యాణకట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్ల పరిశీలన

కల్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సిఎం కెసిఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సుదర్శన యాగం ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసి బస్టాండ్ నిర్మాణాలను సిఎం పరిశీలించారు. పుష్కరిణీలో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్నా నం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ ప నులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మం డపాలనూ సిఎం పరిశీలించారు.కెసిఆర్ వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమా ర్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంఎల్‌ఎలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News