Monday, May 6, 2024

లంచాలు బంద్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలకు ఇక ఆ దుర్గతి పట్టొద్దు : సిఎం కెసిఆర్

వ్యవసాయ రిజిస్ట్రేషన్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సిఎం

 భూముల రిజిస్ట్రేషన్లు అత్యంత పారదర్శకంగా, సులభంగా జరగాలి
 ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదు
 అవసరమైన విధివిధానాలు, మార్గదర్శకాలు మూడు, నాలుగు మాసాల్లో రూపొందాలి
 భూముల రిజిస్ట్రేషన్‌పై ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు

CM KCR Review on Land Registration in Pragathi Bhavan

మన తెలంగాణ/హైదరాబాద్: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా ఆస్తుల-వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకా లు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాల తో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కెసిఆర్ నియమించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స భ్యులుగా ఉంటారు. మూడు, నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు.
వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఒ కార్యదర్శులు శేషాద్రి, స్మిత సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మీ సేవా కమిషనర్ జిటి వెంకటేశ్వర్ రావు, ఎంఎల్‌ఎ బాల్క సుమన్, ఎంఎల్‌సి నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సిఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతున్నదని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో కూడా అలాంటి విధానమే రావాలని సిఎం ఆకాంక్షించారు. “వివిధ కారణాల వల్ల 70,-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఇంకా అలాంటి జాప్యం కావద్దు అని సూచించారు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతున్నదన్నారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు అని ఆయన మరోసారి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావద్దు అని అన్నారు. ఏ అధికారి కూడా తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండవద్దు అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలన్నారు. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలన్నారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ‘పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారన్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

CM KCR Review on Land Registration in Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News