Wednesday, May 1, 2024

దక్షిణ తెలంగాణకు పండుగ రోజు

- Advertisement -
- Advertisement -

మనతెలగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్దమవుతోంది. నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద బటన్ నొక్కి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. బాహుబలి పంపుల ద్వారా కృష్ణానదీజలాలను ఎత్తిపోయనున్నారు. పాలమూరురంగారెడ్డి పథకం పనులపై బుధవారం సీఎం సచివలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల తీరును సమీక్షించారు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలను ఈ ఎత్తిపోతలు తీర్చనున్నాయని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్ధాల కల సాకారమౌతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని సిఎం స్పష్టం చేశారు. ప్రారంభోత్సవం జరిగిన మరునాడు (సెప్టెంబర్ 17న) ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెనా ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్దఎత్తున సంబురాలతో జరుపుకోవాలని అన్నారు.

ప్రారంభానికి పల్లె పల్లెనుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలశాలు తెచ్చుకుని వాటితో తీసుకెల్లిన కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోవాలని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిథిలో కాల్వల తవ్వకం అందుకు సంబంధించి భూ సేకరణ సహా అనుబంధ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే డ్రైరన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకుని సిద్దంగా వున్నఎత్తిపోతల ప్రాజెక్టు వెట్ రన్ ను సిద్ధంగా ఉన్నట్టు సమావేశంలో పాల్గొన్న ఇంజనీరింగ్ అధికారులు సిఎం గారికి వివరించారు. ఇంజనీర్ల సూచనల మేరకు ఈనెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానున్నది.

నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద శ్రీకారం
కృష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్ ప్లో వద్ద) నార్లాపూర్ వద్ద నిర్మించిన ఇన్ టెక్‌వద్దకు చేరుకొని అక్కడ సిఎం కేసిఆర్ స్విచ్ ఆన్‌చేసి పంపులను ప్రారంభిస్తారు. వెట్ రన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్ కు చేరుకోనున్నాయి. మోటర్లు ఆన్ చేసిన వెంటనే సిఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణధ్యాయం లిఖించనున్నది. దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న చారిత్రక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లెనుంచీ సర్పంచులు గ్రామస్థులు ఈ బహిరంగ సభకు హాజరుకావాలన్నారు. ప్రారంభోత్సవం సహా బహిరంగ సభ నిర్వహణ,

మహబూబ్‌నగర్ రంగారెడ్డి జిల్లాల పల్లెలనుంచి ప్రజలను ప్రారంభోత్సవానికి తరలించేందుకు చేపట్టాల్సిన రవాణా ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ప్రభుత్వమే నిర్వహించాలనే సమావేశం ఏకాభిప్రాయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా సిఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

తీరనున్న దశాబ్దాల కల
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….“తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించినయన్నారు. “ కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులను మొదలు పెట్టినట్టే పెట్టాలె వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగులో పెట్టాలె’ ఇదీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి. వొకనాడు సుసంపన్నంగా వర్థిల్లుతూ ఎంతో చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని సొంతం చేసుకున్న పాలమూరు లో గంజికేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి ఉమ్మడి పాలకులది. నాటి వలస పాలనలో పాలమూరులో ఎటుచూసినా వలసలే తాండవించేవి. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్‌కు పేరుగాంచిన దుస్తితినాడు.పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూలు కట్టే దుస్థితి వుండేది.” అని సిఎం వివరించారు. “నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లో కూడా నీరు లేక కరువు తాండవమాడేది. సాగునీరు సంగతి దేవుడెరుగు తాగునీరు కూడా కల్పించలేని నిర్లక్ష్యపూరిత వివక్ష నాటి పాలకులది.’ అని సిఎం తెలిపారు.

పాలమూరు జిల్లా ప్రజల బాధలను నాటి ఉద్యమ కాలంలో గోరెటి వెంకన్న వంటి పాలమూరు కవులు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అంటూ…చేతానమేడుందిరా తెలంగాణ చేలన్ని బీల్లాయెరా అంటూ పాటలు రాసిన సందర్భాన్ని సమీక్ష సందర్భంగా సిఎం గుర్తు చేశారు.“ వలస పోయిన జనం …అనివార్యమైన పెండ్లికో చావుకో వచ్చుడు తప్ప తమ తమ స్వస్థలాలకు రాకపోదురు అంటూ నాడు ఉద్యమ కాలంలో పాటలు రాసి పాడిన సంధర్భాలు మరుద్దామన్నా మరుపురావు. అరవై ఎకరాలున్న ఆసామీ కూడా అడవులు పట్టుకొని కూలీకి పోయిన దుస్థితిని నేను స్వయంగా చూసి దు:ఖపడ్డ. నీరులేక కరువుతో హృదయ విదారకమైన పరిస్థితి తాండవించేవి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అత్యద్భుతమైన నేలలకు నెలవు. ఇక్కడి నేలలు కుంకుమ లాగా వుంటవి. అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు. పసిడి పంటలతో నాడు సిరులు కురిపించే నేలలు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలనలో సాగునీరు లేక కరువు పాలయింది,’ అని ఆవేదన వ్యక్తం చేశారు.“ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నంక స్వయం పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

నూతన ప్రభుత్వం తక్షణమే పాలమూరు పరిథిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలు పెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసింది. దాంతో పాలమూరు జిల్లా పచ్చబడడం ప్రారంభమైంది. వలసలు ఆగిపోయినయి. బయటి రాష్ట్రాలనుంచే పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమైన చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది.” అని జరిగిన ప్రగతిని సిఎం వివరించారు “మరి చిన్న చిన్న పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటెనే ఇంతగొప్పగా పాలమూరు పచ్చబడ్డదంటే దక్షిణ తెలంగాణ దశ దిశను మార్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్పగా తెలంగాణలో అభివృద్ధి అవుతుందో వూహించుకోవచ్చు..’ అని సిఎం వివరించారు.
అదే దార్శనికతతో ఎత్తిపోతలను ప్రారంబించాలని దృఢ సంకల్సంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అనేక అడ్డంకులు ప్రారంభమయ్యాయన్నారు. స్వయానా పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందలాది కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమన్నారు. “ఇటువంటి నేతలు ఉండడం పాలమూరు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించింది. రాజకీయాలు ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చే దిశగా ఉండాలి తప్ప

..ఇట్లా వారిని జీవితాలను చిన్నాభిన్నం చేసే దిశగా తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను బలిపెట్టే దిశగా ఉండకూడదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో సరిగ్గా అదే జరిగింది..” తలెత్తిన అడ్డంకుల గురించి వాటి కారణాల గురించి సిఎం వివరించారు.“అయినా మొక్కవోని పట్టుదలతో ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సవాలుగా స్వీకరించారు. ఎన్ని అడ్డంకులనెదుర్కునేందుకయినా సిద్ధ పడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నిపూర్తిచేసేందుకు కంకణం కట్టుకున్నారు. వొక వైపు నిర్మాణం పనులను మరోవైపు న్యాయం సాధించేందుకు ప్రజలకు సాగునీరు తాగునీరు ను అందించేందుకు తీవ్రమైన కృషిని కొనసాగిస్తూ అడ్డంకులను దాటే ఎత్తుగడలు వ్యూహాలను అమలు పరుస్తూ కొనసాగించిన వారి కృషి ఫలించింది. ఆఖరికి ధర్మమే గెలిచింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పాటు పలు అడ్డంకులు తొలగి పోయాయి. ఇది ఎంతో శుభ సందర్భం.

ఇది తెలంగాణ కు పండుగరోజు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భం కాన్నా మనకు మరో గొప్ప వేడుక ఉంటదని నీననుకోను” అని సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఇరిగేషన్ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ ను, ఇఎన్సీ మురళీధర్ ను, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డిని, సీఈలు రమణారెడ్డిని, హమీద్ ఖాన్ ను సిఎం అభినందించారు.

మావన కృషికి దైవకృప తోడయింది
“మనందరి కృషికి దైవ కృప కూడా తోడు కావడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వో కొలిక్కి వచ్చాయి అని సిఎం అన్నారు. నాటి ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నిలబడి నాణేలు వేసి నీటికోసం మొక్కుదు. ఇట్లా మనం అనేక మొక్కులు మొక్కిన ఫలితమే ఈ విజయం. ఇందుకోసం మనందరం కూడా దేవుని మొక్కలు చెల్లించుకోవాల్సి వున్నది. అందులో భాగంగా కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుండ్ల పాదాలు కడుగుతామని నాతో సహా మనందరం మొక్కిన మొక్కులను తీర్చుకోవాల్సి వున్నది. అందుకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజలు సభకు వస్తున్నప్పుడు కలషాలు తెచ్చుకోవాలె. తెచ్చుకున్న కలషాల ద్వారా కృష్ణా జలాలను తీసుకపోయి స్వామి పాదాలకు అభిషేకం చేయాలి. దేవునిగుడిలో కొబ్బరికాయ కొట్టి పూలుచల్లి అర్చన చేయాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి.

ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి.” అని సిఎం తెలిపారు. ఈనెల 16 నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు మంత్రులు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలి ” అని సిఎం కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లకు సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీల్లను తరలించే కాల్వల నిర్మాణం పనులకోసం టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారు. అందుకోసం అవసరమైన భూ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్దతులనే అనుసరించాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.
అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిథిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణం పనులకు సంబంధించి మహేశ్వరం ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో మంత్రులు ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు.

పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్దప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో వున్నదని సిఎం పునరుద్ఘాటించారు. తద్వారా దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదన్నారు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, సమ్మిళిత సమగ్ర వ్యవసాయరంగాభివద్ధిని సాధించి,తెలంగాణ రైతన్నల లోగిల్లు బంగారు పంటలతో తులతూగి తద్వారా మనం ఆశించిన లక్ష్యంగా పెట్టుకున్న బంగారి తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంచి హృదయం తో పని చేస్తే ప్రకృతి కూడా కరుణిస్తదని, దేవుడు కూడా దయచూపిస్తాడనేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాధించిన విజయమే సాక్ష్యం అని సిఎం అన్నారు.

145 మెగావాట్ల భారీ పంపులు
ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎత్తిపోతలకు వినియోగించే బాహుబలి పంపుల వివరాలను సిఎం కేసీఆర్‌కి ఇరిగేషన్ అధికారులు వివరించారు. ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువు 12 కిలోలుంటుందనీ, దాని రూటర్ 80 టన్నులుంటుందనీ తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 34 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు ఇంజనీర్లు వివరించడంతో సమావేశం ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యంగొలిపే అంశాలు నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని తెలిపారు. బాహుబలి వంటి భారీ పంపులను బిగిస్తున్నప్పుడు చూడడానికే భయం గొలిపే పరిస్థితులుంటాయని సిఎం వివరించారు.

తాను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా చూసానని సిఎం వివరించారు. ఇటువంటి క్లిష్ట పరిస్తితులను దాటుకుంటూ అటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు విద్యుత్ శాఖ అధికారులు పడుతున్న శ్రమను మరోసారి సిఎం కేసీఆర్ అభినందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాడార్ లో వచ్చే చెరువులను నింపే దిశగా అనుసంధానిస్తే కాల్వల పనులను చేపట్టాలని సిఎం అన్నారు. ఉత్తర తెలంగాణ నిర్మించిన చెక్ డ్యాంలో అద్భుత ఫలితాలనిస్తున్నాయని సిఎం తెలిపారు. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో వొక్క తెలంగాణ లో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. అదే విధానాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్భంలోనూ అనుసరించాలని సిఎం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News