Monday, April 29, 2024

తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -
  • శరవేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం
  • పూర్తి పారదర్శకతతో గడప గడపకు సంక్షేమ పథకాలు అమలు
  • బిఆర్‌ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం
  •  హైట్రిక్ విజయంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలే కీలకం
  • హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
  • బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశం

హుస్నాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే అగ్రస్థానంలో సీఎం కేసీఆర్ నిలిపారని రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం నమోదు చేయనున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు చేస్తున్నాయని రోజురోజుకు శృతిమించుతున్న ప్రతిపక్ష పార్టీల దుర్మార్గ చర్యలను ఎక్కడికక్కడ ఎండగట్టి అడ్డుకోని బుద్ధి చెప్పాలని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్ధం కావాలని, ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. శరవేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకు చేరవేస్తున్నామని తద్వారా అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో పరుగులు పెడుతూ ముందుకు సాగుతుందని తెలిపారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో 6వ తేదీ బుధవారం ఎల్కతుర్తి మండలం జగన్నాధపూర్ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు అనంతరం ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రం తోపాటు హుస్నాబాద్ గడ్డపై బిఆర్‌ఎస్ జండా ఎగరనున్నదని భవిష్యత్తు అంతా బిఆర్‌ఎస్ దే అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, విజయవంతంగా అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కేజీ నుండి పీజీ ఉచిత విద్య, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రజలకు వివరించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ బాబు, సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ లకావత్ మానస, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ ఏఎంసీ చైర్మన్ కాసర్ల అశోక్ బాబు, ఎడబోయిన తిరుపతిరెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, నియోజకవర్గంలోని పలు మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News