Saturday, April 27, 2024

మద్యం షాపుల్లో 30% కోటా

- Advertisement -
- Advertisement -

CM KCR's new reservations for setting up liquor shops

మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్‌లకు 15%, ఎస్‌సిలకు 10%, ఎస్‌టిలకు 5%
ప్రగతిభవన్‌లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం, రూ.4,427కోట్ల మేరకు పరిపాలన
అనుమతులు జారీ 24 నుంచి శాసనసభల
వర్షాకాల సమావేశాలు హైదరాబాద్‌లో 4
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వచ్చే ఏడాది
నుంచే కొత్త వైద్య కళాశాలలు రోడ్ల
మరమ్మతులకు అదనంగా రూ.100 కోట్లు
బాలికల వసతి గృహానికి నారాయణగూడలో
1261 గజాల స్థలం పోడు భూములపై
కేబినెట్ సబ్ కమిటీ నియామకం పోలీస్
స్టేషన్లలోని సమస్యలు, అవసరాలపై మంత్రి వర్గ
ఉపసంఘం ధరణిపై మరో కేబినెట్ సబ్ కమిటీ
కరోనా పూర్తి అదుపులో ఉందని స్కూళ్లు,
తెరిచిన తర్వాత కూడా మార్పులేదని
తెలియజేసిన ఆరోగ్య శాఖ అధికారులు
మద్యం దుకాణాల్లో కోటా కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే సంవత్సరం మద్యం దుకాణాల్లో తొలిసారిగా రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. వివిధ వర్గాలకు 30 శాతం మేర రిజర్వేషన్లు ఇవ్వాలని తలపెట్టింది. ఇందులో ఇందులో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్‌సిలకు 10 శాతం, ఎస్‌టిలకు 5 శాతం కేటాయించాస్తూ కేబినెట్ సమావేశం తీర్మానించింది.రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో నాలుగున్నర ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన రూ. 4,427 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నెల 24 నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కూడా మంత్రివర్గ సమావేశం తలపెట్టింది. గురువారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సుమారు ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ధరణి పోర్టల్, పోడు భూములు, కొత్త జిల్లాల్లోని పోలీసు స్టేషన్ల సమస్యలను పరిష్కరించేందుకు మూడు కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కొవిడ్‌పై కూడా విస్తృతంగా చర్చ జరిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వైద్యాధికారులతో కేబినెట్ ఆరా తీసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులు కేబినెట్‌కు సమాచారం అందించారు.

ఈ అంశాలతో పాటు హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలలు, వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూలంకషంగా చర్చించింది. ఇప్పటి వరకు పడిన వర్షపాతం వివరాలు, వానాకాలంలో సాగు వివరాలపై కూడా చర్చించారు. పంటల దిగుబడి అంచనాలపై చర్చించిన కేబినెట్ వానాకాలంలో పంటల కొనుగోలు, మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై చర్చించింది. అలాగే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన రోడ్ల మరమ్మతుకు ఇప్పటికే కేటాయించిన రూ. 300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీచేసింది. రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ కోరిక మేరకు నారాయణ గూడలో 1261 గజాల స్థలాన్ని బాలికల వసతి గృహ నిర్మాణం కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

సంగమేశ్వర, బసవేశ్వరకు గ్రీన్‌సిగ్నల్

సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు పథకాలను అవసరమైన రూ.4,427 కోట్ల మేరకు పరిపాలన అనుమతులకు కూడా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందులో సంగమేశ్వర ప్రాజెక్టుకు రూ.2,653 కోట్లు, బసవేశ్వర ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల మేర వెచ్చించనుంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడివైపు నుంచి 12 టిఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందుతుంది. కాగా బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టిఎంసిల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆంధోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు ఆమోదం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 15,16 లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమౌతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

కరోనా పూర్తిగా అదుపులోనే ఉంది

ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించి సమాచారాన్ని వైద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు పునఃప్రారంభమైన అనంతర పరిస్థితులపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారులు సమగ్రంగా వివరించారు.
స్కూళ్లు, కాలేజీలు తెరిచిన తరువాత కరోనా కేసులలో పెరుగుదల లేదన్నారు. ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులో ఉందని కేబినెట్ కు తెలిపారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.

రెండు కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి

రాష్ట్రంలో 2 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిందని, ఇప్పటివరకు 2 కోట్ల, 56 వేల 159 డోసులు అందించారని అధికారులు వివరించారు. వారిలో 1 కోటి 45 లక్షల 19 వేల 909 మొదటి డోసు, 55 లక్షల 36వేల 250మంది రెండు డోసులు ఇవ్వటం జరిగిందని వెల్లడించారు. స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైందని వివరించారు. ఇందులో ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతి మున్సిపల్ అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు, ఎంపిపి, జెడ్‌పి చైర్ పర్సన్, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు తదితర ప్రజాప్రతినిధులు క్రీయాశీలకంగా వ్యవహరించాలని కేబినేట్ నిర్దేశించింది. అలాగే మంత్రులందరూ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించింది. ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా పూర్తి సన్నద్దతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులను, ప్రజాప్రతినిధులను వారు ఆదేశించింది.

వచ్చే సంవత్సరం నుంచే కొత్త మెడికల్ కాలేజీలు

కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బి, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కేబినెట్ సమీక్షించింది. ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని కేబినెట్ ఆదేశించింది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధం మాత్రమే ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్ ఆదేశించింది.

చిన్న పిల్లలకు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం

కరోనా ఒకవేళ చిన్నపిల్లలకు వస్తే పరిస్థితులను ఎదర్కోవడానికి సిధ్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు. దీని కోసం రూ.133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్దం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్య శాఖాధికారులను ఆదేశించింది.

24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాలు మార్చి 26న ముగిసినందున ఆరు నెలల్లోగా అంటే ఈనెల 25లోగా తిరిగి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 24న నుంచి ఉభయ సభల సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. వారం, పది రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే శాసనమండలిలో ప్రస్తుతం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో శాసనసభ్యుల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒకటి ఖాళీగా ఉంది. శాసనసభ్యుల కోటాలో ఎంఎల్‌సి ఎన్నికలకు శాసనసభ సమావేశాల్లోపు అనుమతి లభిస్తే వెంటనే మండలి ఛైర్మన్‌ను ఎన్నుకునే వీలుంది. సమావేశాల నాటికి ఎన్నికలు జరగకపోతే ప్రొటెం స్పీకర్ భూపాల్‌రెడ్డే కొనసాగుతారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీకి స్థానిక సంస్థల కోటా స్థానాలు 12 ఖాళీ అవుతున్నాయి.

పోడుభూములపై కేబినెట్ సబ్ కమిటీ

రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పోడు భూ ముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం కట్టింది. ఈ మేరకు పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఈ ఉపసంఘానికి చైర్‌పర్సన్‌గా మంత్రి సత్యవతి రాఠోడ్ వ్యవహరిస్తారు. సభ్యులుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరిచనున్నారు.

పోలీసు స్టేషన్లలోని సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. హోం శాఖమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా సబ్ కమిటీ పనిచేస్తుంది. రాష్ట్రంలో నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖను సబ్ కమిటీ పూర్తి స్థాయిలో సమీక్షిస్తుంది.

ధరణి పోర్టల్ సమస్యలపై సబ్ కమిటీ

రాష్ట్రంలో భూపంచాయితీలను శాశ్వతంగా పరిష్కరిందేకు ప్రభుత్వం ఇటీవల ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ధరణి పోర్టల్ సక్రమంగా అమలు చేయడంతో తలతెత్తుతున్న అంశాలపై మంత్రివర్గం సమావేశం చర్చించింది. వీటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News