Saturday, April 27, 2024

తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి ఒక్కటే !

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీని గిల్లితే బిజెపి నేతలకు నొప్పి లేస్తున్నది !!
చేతనైతే కొత్త మెడికల్ కళాశాలను కొడంగల్‌లో పెట్టాలి
ఆలేరు మెడికల్ కళాశాలను తరలించడం పద్ధతి కాదు
ఇంతవరకూ మూడెకరాలకు మించి రైతుబంధు ఇవ్వలేదు
రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? స్పష్టత ఇవ్వాలి
బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటే అని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బిజెపి నేతలకు నొప్పి లేస్తున్నదని విమర్శించారు. బిఆర్‌ఎస్, కెసిఆర్ మీద బురదజల్లిన బిజెపి పార్టీ హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 72 రోజులలో ఉచిత బస్సు తప్ప కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం ఏం చేసింది..? అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు సంబంధించి బడ్జెట్‌లో సరిపడా కేటాయింపులు లేవు అని, 72 రోజులలోనే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా తేల్చిచెప్పిందని పేర్కొన్నారు.
హరీశ్‌ రావు జవాబులకు తట్టుకోలేకపోయారు
మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు జవాబులకు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయారని అన్నారు. అందుకే అసెంబ్లీలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరమని అని విమర్శించారు. 15 నెలల క్రితం హిమాచల్ ప్రదేశ్, 8 నెలల క్రితం కర్ణాటకలో, 72 రోజుల క్రితం తెలంగాణలో.. 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమయిందని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. ఇంతవరకూ మూడెకరాలకు మించి రైతుబంధు ఇవ్వలేదని అన్నారు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ..? స్పష్టత ఇవ్వాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడం మీద ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఏ చర్యకైనా, విచారణకైనా బిఆర్‌ఎస్ సిద్ధం
కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం కాంగ్రెస్ చేతిలోనే ఉన్నదని, కాళేశ్వరంపై అత్యున్నతస్థాయిలో విచారణ జరిపించండి అని పేర్కొన్నారు. ఏ చర్యకైనా, విచారణకైనా బిఆర్‌ఎస్ సిద్ధమని స్పష్టం చేశారు.బిఆర్‌ఎస్ పార్టీపై కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దని కోరారు. కాళేశ్వరం కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉన్నదని తెలిపారు. కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరా విషయంలో స్పష్టత లేదని, ఈ పథకాల పేర్లు మారుస్తారా..? ఏం చేస్తారో ప్రజలకు అందాల్సినవి అందేలా చూడాలని సూచించారు. ఆలేరు మెడికల్ కళాశాలను కొడంగల్‌కు తరలించడం పద్ధతి కాదని, చేతనైతే కొడంగల్‌లో కొత్త మెడికల్ కళాశాల పెట్టాలని అన్నారు. వెనకబడ్డ కొడంగల్ అభివృద్దిని తాము ఖచ్చితంగా హర్షిస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రతి ఇంచుపై కెసిఆర్‌కు అవగాహన ఉన్నది
వనపర్తి రాజులు కట్టిన సరళాసాగర్ ప్రాజెక్టు నిజాం రాజులు కట్టారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దుగ్దతో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని, కాంగ్రెస్ నేతల భౌగోళిక పరిజ్ఞానానికి దండాలు అని విమర్శించారు. తెలంగాణ ప్రతి ఇంచు మీద కెసిఆర్‌కు అవగాహన ఉన్నదని, అందుకే గత పదేళ్లలో తెలంగాణను అభివృద్ది చేశారని తెలిపారు. గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, రైతుభీమా, నీళ్లు, కరంటు, వరి ధాన్యం, పంటల కొనుగోళ్లు, వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌పై కచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో మాటతప్పితే విడిచిపెట్టేది లేదని నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News