Saturday, April 27, 2024

ప్రాంతీయ పార్టీలకు జాతీయ తోకలు

- Advertisement -
- Advertisement -

Congress, BJP are national parties become tail parties for regional parties

 

27 మార్చి 2021న ప్రారంభం కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, నాయకులు చేయని ప్రయత్నాలు లేవు, పడని పాట్లు కనిపించవు. అసోం (126 సీట్లు), పశ్చిమ బెంగాల్ (294), తమిళనాడు (234), కేరళ (140), కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరి (30)లలో ఎన్నికల ఫలితాలు 02 మే రోజున రానున్నాయి. ఐదేళ్ల క్రితంతో పోల్చితే నేటి ఎన్నికలలో చిత్ర విచిత్రాలు, ఫిరాయింపు, వాగ్దానాల సునామీలు, ఓటర్లకు గాలాలు, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడాలు లాంటి ఆటలు బయట పడుతున్నాయి. ఐదు రాష్ట్రాలలో బిజెపి పాగా వేయడానికి, సీట్లను , ఓట్లను పెంచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ, సాంప్రదాయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయాస పడుతున్నది. 2016లో జరిగిన ఐదు రాష్ట్రాల 824 అసెంబ్లీ సీట్లలో బిజెపి 64 మాత్రమే గెలిచింది. అసోంలో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. నేడు అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి బిజెపి పావులు కదుపుతూ, ఇతర రాష్ట్రాలలో తన బలాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు అమలు పరుస్తున్నది. గత కొద్ది మాసాలుగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటం కూడా అసెంబ్లీ ఎన్నికల మీద ప్రభావాన్ని చూపవచ్చు. కాంగ్రెస్ , బిజెపిలు జాతీయ పార్టీలైనప్పటికీ ప్రాంతీయ పార్టీలకు తోక పార్టీలుగా మారడం దేశ వ్యాప్తంగా నేటి రాజకీయాలలో సాధారణమై పోయింది.

పశ్చిమ బెంగాల్‌లో 2016 ఎన్నికల్లో 3 సీట్లు మాత్రమే గెలిచిన బిజెపి 2019 లోకసభ ఎన్నికల్లో 42 సీట్లకుగాను 18 ఎంపి సీట్లు చేజిక్కించుకొని 40.64 శాతం ఓట్లను పొంది అనూహ్య విజయాలను నమోదు చేసింది. నేడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల వైపు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మైనారిటీ జనాభా అధికంగా 28.-32 శాతం ఉన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్, బిజెపి అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. హిందూ ఓటర్లందరినీ ఏకతాటిపైకి తేవడానికి మోడీ, షా ద్వయం ప్రత్యేక శ్రద్ధ పట్టారని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలను 8 సెగ్మెంట్లుగా విభజించి నిర్వహించడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. అత్యంత దూకుడు స్వభావం కలిగిన మమతా బెనర్జీ నాయకత్వాన్ని చిన్న చూపు చూడడానికి ఆస్కారం లేదని బిజెపి, కాంగ్రెస్, సిపియం పార్టీలకు తెలుసు.

బిజెపి పక్షాన కైలాస్ విజయ వర్గీయ నేతృత్వంలో మమత సన్నిహితులైన తృణమూల్ ప్రముఖ నాయకులను తన వైపుకు తిప్పుకోవడంలో కాషాయ పార్టీ సఫలీకృతం అవుతున్నది. మమత కోటలో ఆపరేషన్ ఆకర్ష్ అమలు పరుచుతూనే ‘బిజెపితోనే బంగారు బంగ్లా’ అనే నినాదంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగెస్, సిపియంల చుట్టరికం ఎన్ని ఓట్లను రాల్చుతుందో చూడాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని 23 జిల్లాల్లో 09 జిల్లాలు మాత్రమే 62 శాతం ఓటర్లను కలిగి 185 అసెంబ్లీ సీట్లను (294 సీట్లలో) కలిగి ఫలితాలను తారుమారు చేయవచ్చు. బెంగాల్‌లో దాదాపు 30 శాతం ముస్లిం ఓటర్లు తృణమూల్ వైపుననే ఉంటూ వస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన ఎడల తృణమూల్ ఓట్లకు గండిపడడం ఖాయం అంటున్నారు.

అసోం, కేరళలో కూడా మైనారిటీ ఓటర్లు ఎక్కువగానే ఉన్నప్పటికీ బిజెపి రాజకీయ చదరంగంతో సీట్లను, ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుతున్నాయి. అసోంలో సిఎఎ (సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్స్ ఆక్ట్), ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) లు ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా నిలువనున్నాయి. అసోంలో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లను కట్టడి చేసే చట్టాలు రావడం రాష్ట్రవాసులకు హితకరమైనప్పటికీ, ఈ చట్టాలతో అసోం వాసులకు కొన్ని అనుమానాలు కూడా ఉండవచ్చు. ఈ క్రమంలో జరిగిన షాహీన్ భాఘ్ అల్లర్లలో 65 మందికి పైగా చనిపోయారు. గతంలో జరిగిన పలు సున్నిత రాష్ట్ర అంశాలు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదు. ప్రధాని మోడీ, అమిత్ షా, జెపి నడ్డా అనుభవాన్ని పునాదిగా చేసుకొని బిజెపి ప్రచారంలో ముందున్నది. అనాదిగా రాజ్యమేలిన కాంగ్రెస్ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారడం, ప్రాంతీయ పార్టీలను ఆశ్రయించడం చూస్తున్నాం.

ఈ ఐదు రాష్ట్రాలలో అధికార పార్టీకి ఓటర్ల ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు కూడా లేకపోలేదు. 2016లో కాంగ్రెస్, -డియంకె విఫలయత్నంతో ఎఐఎడియంకె అధికారంలోకి వచ్చింది. కరుణానిధి లేని డియంకె, జయలలిత లేని ఎఐఎడియంకె పార్టీల బలహీనతలను ఓట్లుగా మలుచుకోవడానికి, తమిళనాడులో తన ఉనికిని చాటుకోవడానికి బిజెపి, కాంగ్రెస్‌లు రణ నీతి రచిస్తున్నాయి. స్టాలిన్ నేతృత్వంలోని డియంకె, అంతర్గత కుమ్ములాటలతో నడుస్తున్న ఎఐఎడియంకె మధ్య ప్రధాన పోరు జరిగితే, బిజెపి, కాంగ్రెస్‌లు తమిళ ప్రాంతీయ పార్టీల పొత్తులతోనే సర్దుకుపోవలసిన దుస్థితిలోనే ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. చిన్నమ్మ శశికళ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యంలో ముంచెత్తడం కొసమెరుపు.

కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్న తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు మలుచుకునేలా బిజెపి వ్యూహాలకు పదును పెడుతున్నది. గత నాలుగు దశాబ్దాలుగా కేరళ అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీల కూటమి ఎల్‌డిఎఫ్, కాంగ్రెస్‌తో కూడిన యూడిఎఫ్ పార్టీలు మాత్రమే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. కేరళలో కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీల మధ్య పోరు జరిగితే, ఇతర రాష్ట్రాలలో ఈ పార్టీలు కలిసి పోటీ చేయడం విచిత్రంగా తోస్తున్నది. ప్రభుత్వంలోని ఎల్‌డిఎఫ్‌ను ఎదుర్కోడానికి కాంగ్రెస్, బిజెపిలు శ్రమించాల్సిందే. పుదుచ్చెరి కేంద్ర పాలిత ప్రాంతంలోకి 33 అసెంబ్లీ సీట్లలో 3 సీట్లు నామినేటెడ్ కేటగిరీలో ఉండగా, 30 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. పుదుచ్చెరిలో 88 శాతం తమిళం మాట్లాడే ప్రజలు ఉండగా, తెలుగు, మలయాళం, ఉర్దూ, హిందీ మాట్లాడే జనులు కూడా ఉన్నారు. సియం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన తరుణంలో రాష్ట్రపతి పాలన విధించిన వేళ ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్‌తో డియంకె, లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలోకి రావడానికి ప్రణాళికలు వేస్తున్నది. బిజెపితో ఎఐఎన్‌ఆర్‌సి, ఎఐఎడిఎంకె , ఇతర చిన్న పార్టీల కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో 824 ఎంఎల్‌ఎలను ఎన్నుకోనున్నారు. నేటి ఫలితాలు భవిష్యత్తులో 116 ఎంపి స్థానాల ఎన్నికల్లో ప్రభావాన్ని చూపనున్నాయి. కేరళ, అసోంలలో కాంగ్రెస్ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు పరీక్ష పెట్టనున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి తన ఓట్ల శాతాన్ని పెంచుకొని, బెంగాల్, అసోంలలో అధికారాన్ని చేజిక్కించుకునే విశ్వప్రయత్నాలు చేయడం ఖాయంగా తోస్తున్నది. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతాలు, ఎన్నికల మానిఫెస్టోల ఆధారంగా జరగాల్సిన ఎన్నికల్లో నోట్ల కట్టలు, ఫిరాయింపులు, మద్యం ప్రవాహాలు, అసాధ్య వాగ్దానాలు లాంటి అనారోగ్యకర , అనైతిక అంశాలు ప్రధాన భూమికను నిర్వహిస్తే, ఏ పార్టీలు గెలిచినా, ప్రజలు, ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లే అని నమ్మాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News