మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణలు
ముంబై : మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ మాదిరిగా కొందరు తనను తప్పుడు కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందని, దీనికోసం తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని మహారాష్ట్ర మంత్రి, ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఈమేరకు సంబంధిత ఫోటోలను ఆయన షేర్ చేశారు. శనివారం ఇక్కడి పాత్రికేయులతో మాట్లాడుతూ దీనిపై ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగరాలేకు, కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. గత కొద్ది రోజులుగా ఇద్దరు వ్యక్తులు తన ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారని, వారెవరో తెలిస్తే తనకు తెలియచేయాలని ఆయన ఫోటోలను చూపిస్తూ కోరారు.
గతవారం తాను దుబాయ్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కెమెరా పట్టుకుని తన ఇంటివద్ద రెక్కీ నిర్వహించారని, తన ఇంటి గురించి, స్కూళ్లు, ఆఫీస్, మనుమలు గురించి సమాచారం సేకరించడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కొంతమంది వారిని ముఅడ్డుకుని ప్రశ్నించగా అక్కడ నుంచి పారిపోయారని తెలిపారు. ఆ ఇద్దరిలో ఒకరు తనకు వ్యతిరేకంగా కూ హ్యాండిల్లో రాశారని ఆయన అన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన కొందరు అధికారులు తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ఈ మెయిల్ ద్వారా పంపడానికి వాట్సాప్ డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారనిదీనికి సంబంధించి వాట్సాప్ చాట్ రుజువులు ఉన్నాయని చెప్పారు. మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు బూటకపు కేసులు దాఖలు చేయడానికి ప్రయత్నిస్తే ఇది సహించరాని తీవ్రమైన విషయంగా ఆయన పేర్కొన్నారు. ముంబై లోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఈ మంత్రి అనేక సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ఈ కేసును సాధనంగా వాడుకున్నారని ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర మాజీ హోం మంత్రి , ఎన్సిపి నేత మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఈడీ, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి.