బెంగళూరు: ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా ఇతర దేశాలకు పాకింది. ఇండియాలోనూ 31 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. తాజాగా దుబాయి నుంచి కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు విమానాశ్రయ అధికారులు గుర్తించారు. దీంతో అతనిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, సదరు వ్యక్తి ఆదివారం రాత్రి ఆస్పత్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ కరోనా లక్షణాలను కలిగి ఉన్న అతను వైద్యులకు సహకరించకుండా, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని చెప్పి ఆస్పత్రి నుంచి పారిపోయాడని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది సోమవారం మంగళూరు దక్షిణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రి నుంచి పారిపోయిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో చేర్పించేందుకు అతనిని ఒప్పించామని డిప్యూటీ కమిషనర్ సింధూ బీ రూపేష్ తెలిపారు.
Corona suspected patient escape from Mangalore Hospital