Tuesday, April 30, 2024

ఎలక్షన్ నేపథ్యంలో వైరస్ ‘ఫీయర్’…!

- Advertisement -
- Advertisement -

బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, ఆత్మీయ కలయికలతో ఆందోళన
45 శాతం మంది మాస్కు, భౌతిక దూరాన్ని పాటించట్లేదని గుర్తించిన వైద్యశాఖ
మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయని టెన్షన్ పడుతున్న ప్రజలు
సెకండ్ వేవ్ దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నఅధికారులు
వైరస్‌ను కంట్రోల్ చేసేందుకు సంసిద్ధమైన ఆరోగ్యశాఖ

Corona virus fear in GHMC elections

మన తెలంగాణ/హైదరాబాద్:  గ్రేటర్ ప్రజల్లో ఎలక్షన్ ‘ఫీయర్’ ప్రారంభమైంది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలు, పార్టీ గేదర్స్, ఇంటింటి ప్రచారాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రజల్లో మరింత టెన్షన్ పెరిగింది. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే వరద ప్రాంతాల్లో కోవిడ్‌తో పాటు ప్లూ, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు నిర్వహిస్తే వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కావున రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచిస్తుంది.

45 శాతం మంది లైట్ తీసుకుంటున్నారు….

గ్రేటర్ పరిధిలో సుమారు 45 శాతం మంది ప్రజలు కరోనా వైరస్‌ను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రతి రోజూ నమోదైన కేసుల సంఖ్య తగ్గడంతో చాలా మంది వైరస్ తగ్గుముఖం పట్టిందనే అభిప్రాయంలో ఉన్నారు. మరోవైపు ఫెస్టివల్స్ తర్వాత కూడా కేసుల సంఖ్య తగ్గడంతో వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందనే భ్రమలో మరి కొందరు ఉండటం గమనార్హం. దీంతోనే మాస్కు, భౌతిక దూరం వంటి వ్యాప్తి నియంత్రణ ప్రాథమిక సూత్రాలను కూడా పాటించడం లేదు. మార్కెట్లు, జనసమ్మర్ధ ప్రాంతాలు, షాపింగ్ మాల్స్‌లో కూడా ఇదే వైఖరి కొనసాగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఇటీవల జరిగిన బతుకమ్మ, దసరా, దీఫావళీ ఫెస్టివల్స్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన నిపుణులు అంచనా వేసినంత వైరస్ వ్యాప్తి జరగలేదు. అంతేగాక కేసుల సంఖ్య కూడా అతి తక్కువగా తేలడంతో చాలా మంది వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది….

వైరస్ వ్యాప్తికి శీతాకాలం అనువుగా ఉంటుంది. శీతల వాతావరణ పరిస్థితుల్లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వలన వ్యాధుల వ్యాప్తి భారీగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. దీంతో వైరస్ నియంత్రణ చర్యలను పాటించకపోతే ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని తాజాగా డబ్లూహెచ్‌ఓ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈక్రమంలో ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాలకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి చే జారిపోతుందని ప్రజలతో పాటు అధికారుల్లో సైతం భయం నెలకొంది.

వైరస్‌ను అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు…

శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో వైరస్ తీవ్రత పెరగకుండా గ్రేటర్ పరిధిలో అన్ని చర్యలను చేపట్టినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రజలకు వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించడంతో పాటు పారిశుధ్య శుభ్రతను కూడా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనే వారు మాస్కు తప్పనిసరిగా ధరించేలా వైద్యశాఖ చర్యలు తీసుకోనుంది. “నో మాస్కు నో ఎంట్రీ”స్లోగన్‌ను పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. మాస్కు లేకపోతే ప్రచారాలు, ఇతర ఎన్నికల కార్యకలాపాలు, పోలింగ్ కేంద్రాల్లో పాల్గొనకుండా సదరు రాజకీయ పార్టీలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచిస్తుంది. అంతేగాక వ్యక్తికి మరోకరికి ఆరు అడుగుల భౌతిక దూరాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్యశాఖ కోరింది. వీటిని పర్యవేక్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని డిహెచ్ సూచించారు. అంతేగాక కరోనా నియంత్రణ మార్గదర్శకాలను పోస్టర్ల రూపంలో అన్ని ప్రాంతాల్లో అంటించనున్నారు.

ఇంటింటికి ప్రచారం చేసే అభ్యర్థితో పాటు మరో నలుగురు వ్యక్తులు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నూతన నిబంధనను పెట్టారు. అంతేగాక రోడ్ షోలలో వాహనానికి మరోక వెహికల్‌కి సుమారు 100 మీటర్ల దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. మరోవైపు వైరస్ సోకిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండాపిహెచ్‌సి స్థాయి నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని రకాల చికిత్స సౌకర్యాలను అందుబాటులో ఉంచామని డిహెచ్ పేర్కొన్నారు. మౌళిక వసతులు, మందులు, సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. వాస్తవంగా శీతాకాలం సమయంలో సాధారణ ప్లూ, సైన్‌ప్లూతో పాటు ఇతర డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు కూడా విజృంభించే అవకాశం ఉంది. ఈక్రమంలో వర్షాలు వలన కలుషితమైన నీరు, దోమలు వలనే వచ్చే వ్యాధులపై కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ప్లూ, ఇతర సీజనల్ జ్వర లక్షణాలు ఉంటే, వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News