మంత్రి కెటిఆర్కు విజ్ఞప్తి చేసిన టియుడబ్ల్యుజె
మనతెలంగాణ/హైదరాబాద్: దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటీషన్లు దాఖలైన వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కాలయాపన చేయకుండా వెంటనే పరిష్కారం చూపాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూడబ్ల్యూజే) అభిప్రాయపడింది. గురువారం మంత్రి కె.తారకరామారావుతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ‘మీట్-ది-ప్రెస్‘ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంత్రి కెటిఆర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోవడం విచారకరమన్నారు. మూడేళ్ళుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో తిరస్కరణకు గురవుతుండడంతో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని, చాలామంది అప్పులు చేసి చికిత్స పొందినట్లు విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన మంత్రికి విజ్ఞప్తి చేశారురు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే నాయకులు ఏ.రాజేష్, రాములు, కె.మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.