కలవరపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విస్తరణపై నగర వాసుల ఆందోళన
మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రజల డిమాండ్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటు జీవిస్తున్నారు. ఏరూపంలో వైరస్ కబళిస్తుందో అని ఆందోళన చెందుతూ బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. గతవారం రోజుల నుంచి 700కు పైగా పాజిటివ్ కేసులు, అరడజనుకు పైగా మరణాలు జరగడంతో రానున్న రోజుల్లో మహమ్మారి మరింత విస్తరిస్తుందని జంకుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సమయంలో ప్రజలు ఇంటికి పరిమితం కావడంతో కేసుల సంఖ్య తక్కువ స్థ్దాయిలో నమోదైంది. మూడో విడత లాక్డౌన్ మద్యం దుకాణాలు, రిజిష్ర్టేషన్ తదితర కార్యాలయాలు సేవలందించాలని అధికారులు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా రోడ్లపైకి ప్రజలు రావడంతో వైరస్ విజృంభించాక రెండు సంఖ్యలకే పరిమితి అయిన వైరస్ మే 15 తరువాత దారుణంగా పెరుగుతోంది.
జిహెచ్ఎంసి, వైద్యాధికారులు, పోలీసులు అన్ని చర్యలు చేపట్టిన కరోనా ఉగ్రరూపం దాల్చి రోజుకు వందలాది మందిని అసుపత్రుల బాట పట్టేలా చేసింది. ఇటీవలే జర్నలిస్టుకి సోకి మృతి చెందడం నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. రానున్నది వర్షాకాలం కావడంతో వైరస్ రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలు హరిస్తుందని వణికిపోతున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్నగరంలో 6,500 కేసులు నమోదు కాగా 185 మందికి పైగా మృత్యు వాత పడ్డారు. అధికారులు 158 కంటైన్మెంట్ జోన్లు ఎర్పాటు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజలు ప్రభుత్వం సూచించిన విధంగా ముఖానికి మాస్కులు, శానిటైజర్లను వినియోగించాలని, ఇష్టానుసారంగా రోడ్లపైకి రాకుండా అత్యవసర పరిస్ధితుల్లో రావాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్షం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. నగర ప్రజలు కూడా లాక్డౌన్ మరోసారి విధించి వైరస్ వేగానికి కళ్లెం వేయాలని కోరుతున్నారు.