న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం, లింగమార్పిడి, గే సెక్స్ కోసం ప్రత్యేకంగా తయారుచేసుకున్న గ్రిండర్ అనే సోషల్ నెట్వర్కింగ్ యాప్ ద్వారా స్నేహం చేసి సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపి బ్లాక్మెయిల్ చేసే ఒక ముఠా వలలో దేశ రాజధానిలోని వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన 50 మందికి పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్లతోసహా మొత్తం 150 మంది వరకు చిక్కుకున్నారు. గడచిన మూడు నెలలుగా ఈ ముఠా పన్నిన వలలో కొన్ని కంపెనీలకు చెందిన సిఇఓలతో సహా అత్యున్నత స్థాయి అధికారులు చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ యాప్ ద్వారా కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎరవేసి వారిని ఒక నిర్ణీత రోజున దేశ రాజధాని శివార్లలోని ఎక్స్ప్రెస్ వేలకు ఈ ముఠా సభ్యులు రప్పించేవారు. కారులో శృంగారం జరుపుతున్న సమయంలో ఈ ముఠా సభ్యులు వారిపై దాడి జరిపి, నగ్నంగా ఉన్న వారిని ఫోటోలు, వీడియోలు తీసి, అక్కడే వారిని కొట్టి నగదు, విలువైన వస్తువులను దోచుకునేవారని పోలీసులు చెప్పారు. ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వలవేసి ఈ ముఠా సభ్యులలో ఒకడిని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. గత మూడు నెలల్లో 150 మంది బాధితులలో కనీసం 80 మందిని గుర్తించగలిగామని పోలీసు కమిషనర్ ముహమ్మద్ అకిల్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.