రంగారెడ్డి: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) పాజిటీవ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో గురువారం పర్యటించారు. లాక్డౌన్ నిబంధనలకు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనాను అరికట్టాలంటే లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు, వస్తువుల కోసం రోడ్లపైకి వచ్చేవారికి 3 కిలోమీటర్ల పరిధిలోపు మాత్రమే అనుమతి ఉంటుందని, రోడ్లపైకి వచ్చేవారు తప్పకుండా హెల్మెట్, లైసెన్స్, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేసినా ప్రజలు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.
CP Sajjanar Warning to Amid Lockdown Violators in Hyd