ఉపసర్పంచ్ కుర్చీలో, సర్పంచ్ కింద కూర్చున్న ఘటన
కడలూర్: తమిళనాడులో గ్రామ సర్పంచ్ అయిన ఓ దళిత మహిళను అధికారిక కార్యక్రమాల్లో అవమానించిన సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటన కడలూర్ జిల్లా తేర్కు తిత్తాయి గ్రామ సర్పంచ్ ఎస్.రాజేశ్వరి విషయంలో జరిగింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పిలు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారం గ్రామాన్ని సందర్శించిన అధికారులు దర్యాప్తు జరిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శి సింధూజను సస్పెండ్ చేశారు.
సర్పంచ్ను అవమానించడంలో కీలకంగా వ్యవహరించిన ఉప సర్పంచ్ మోహన్రాజ్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఓ గ్రామ పంచాయతీ సమావేశంలో ఉపసర్పంచ్తోపాటు వార్డు సభ్యులు కుర్చీలపై కూర్చోగా, సర్పంచ్ రాజేశ్వరి ఫ్లోర్పై కూర్చున్న ఫోటో వైరల్ కావడంతో సంఘటన వెలుగు చూసింది. జులై 17న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో వైరల్ అయిన తర్వాతే రాజేశ్వరి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆయా సందర్భాల్లో జాతీయ జెండాను కూడా తనను కాదని ఉపసర్పంచ్ ఎగురవేశారని ఆమె తన ఫిర్యాదులో పాల్గొన్నారు. అధికార ఎఐఎడింఎకెసహా డిఎంకె, ఎండిఎంకె, విసికె, వామపక్షాలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి.