Monday, April 29, 2024

రాష్ట్రాల నిరసనతో కేంద్రం పీచేముఢ్

- Advertisement -
- Advertisement -

Decision to increase GST on textiles

జౌళిరంగంపై జిఎస్‌టి పెంపు నిర్ణయం
వాయిదా, జిఎస్‌టి కౌన్సిల్‌లో ఏకగ్రీవ
ఆమోదం, నేతన్నలకు ఊరట

ఫలించిన కెటిఆర్ అలుపెరగని పోరాటం

టెక్స్‌టైల్స్‌పై జిఎస్‌టి పెంపు నిర్ణయాన్ని ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర మంత్రి
కేంద్రమంత్రులకు వరుస లేఖలు, ట్వీట్లు

న్యూఢిల్లీ : తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో జౌళిరంగం (టెక్స్‌టైల్)పై జిఎస్‌టి రేటు పెంపును వాయిదా వేయాలని జిఎస్‌టి కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన 45వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, రెవెన్యూ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టెక్స్‌టైల్ ఉత్పత్తులపై జిఎస్‌టి రేటును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచనున్నట్టు గతంలో కేంద్రం ప్రకటించింది. 2022 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రావాల్సి ఉంది. దీంతో పలు రాష్ట్రాలు టెక్స్‌టైల్‌పై జిఎస్‌టి పెంపును వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో టెక్స్‌టైల్‌పై రేటు పెంపు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

వచ్చే కౌన్సిల్ సమావేశం 2022 ఫిబ్రవరి వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు సీతారామన్ తెలిపారు. వస్త్రాలపై జిఎస్‌టి రేటు హేతుబద్దీకరణపై సమీక్ష కోసం కమిటీకి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కమిటీ ఫిబ్రవరిలో తన నివేదికను సమర్పించనుంది. దీని తర్వాత ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో జరిగే సమావేశంలో కమిటీ ఈ నివేదికపై చర్చిస్తామని ఆమె అన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో మంత్రుల బృందం రేటుపై నివేదిక ఇస్తుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్, కేరళ, బీహార్ మంత్రులు ఉన్నారు. వస్త్రాలపై పన్నును ఉపసంహరించుకునేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని, అందువల్ల దీనిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని సీతారామన్ పేర్కొన్నారు.

జిఎస్‌టి పెరిగితే నష్టాలు

దుస్తులపై జిఎస్‌టి రేటు పెంపు వల్ల సామాన్యులపై ప్రభావం పడుతుందని, ఎంఎస్‌ఎంఇ రంగం కూడా నష్టపోతుందని వ్యాపార వర్గాలు తెలిపాయి. నిత్యావసర వస్తువుల్లో ఉన్న దుస్తులపై జిఎస్‌టి పెంపు నిర్ణయం పట్ల హోజరీ తయారీదారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని వస్త్ర పరిశ్రమలో అసంఘటిత రంగం 80 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఇది చేనేత కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా గత 2 సంవత్సరాల్లో ఈ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. జిఎస్‌టి పెంపు ప్రకటన రికవరీపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఖర్చులు పెరగడం, కోవిడ్-19 మహమ్మారి రెండవ వేవ్‌తో ఆర్థికంగా ప్రభావం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదాయాన్ని మెరుగుపరచాలని భావించింది. ఇప్పటికే ప్రభుత్వం గతంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించింది. దీంతో ప్రభుత్వంపై భారం కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వస్త్రాలపై జిఎస్‌టిని పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News