Monday, April 29, 2024

కెసిఆర్ సారధ్యంలో పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి పట్టం

- Advertisement -
- Advertisement -

బల్మూర్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధికి పట్టం కడుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం మండల పరిధిలోని జినుకుంట గ్రామంలో రూ. 3.50 కోట్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు. జినుకుంట నుంచి తుమ్మన్ పేట మార్గంలో బ్రిడ్జి నిర్మాణం, గ్రామంలో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీలు, గ్రామ పంచాయతి నూతన భవనం శంకుస్థాపన, ఆరోగ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిని సాధిస్తూ కేంద్ర ప్రభుత్వంచే ఆదర్శ గ్రామాలుగా అవార్డులు ఆదుకోవడం గొప్ప పరిమాణమని, ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధ్దికి పట్టం కడుతున్నాయన్నారు. అచ్చంపేట ప్రాంత ప్రజలను సస్యశ్యామలం చేయడానికి అచ్చంపేట ఇరిగేషన్ ప్రాజెక్టులకు మొదటి దశ ఎత్తిపోతల పథకానికి రూ. 1061.39 కోట్ల టెండర్లకు నోటిఫికేషన్ వచ్చిందని, త్వరలోనే టెండర్లు పూర్తై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభిస్తారన్నారు.

ప్రాజెక్టులు పూర్తి అయితే దాదాపు 57 వేల 200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండించి రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వ కర్తవ్యమన్నారు. అంతకు ముందు శ్రీ కనకాల మైసమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామంలో డప్పు చప్పుళ్లతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యేకు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మెన్ జబ్బు నర్సయ్య యాదవ్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపిటిసి లక్ష్మి దేవమ్మ, నాయకులు గోపాల్ నాయక్, విష్ణుమూర్తి, సుదర్శన్, రాజు, రవి, రమేష్, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News