Saturday, April 27, 2024

ప్రపంచాన్ని చుట్టు ముడుతున్న షుగర్ మహమ్మారి

- Advertisement -
- Advertisement -

లండన్ : 2050 నాటికి ప్రపంచం చక్కెరతో చేదెక్కుతుంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది వరకూ మధుమేహం లేదా షుగర్ వ్యాధిగ్రస్తులై జీవించాల్సి వస్తుంది. ఇది అప్పటి జనాభాలో మొత్తం 13.4 శాతంగా ఉంటుంది. 2021 నాటి షుగర్ వ్యాధిరోగుల సంఖ్యతో పోలిస్తే మరో 27 సంవత్సరాలలో షుగర్ 6.7 శాతం పెరుగుతుంది. 2021 లెక్కల ప్రకారం డయాబెటిక్ ఉన్న వారి సంఖ్య దాదాపు 60 కోట్లు. పలు దేశాలలో సాగించిన విశేష అధ్యయనాలతో కూడిన నివేదికను లాన్సెట్ వైద్య విజ్ఞాన పత్రిక వెలువరించింది. వచ్చే 30 ఏళ్లల్లో వయోభేదం లేకుండా డయోబెటిక్ అందరికీ సోకుతుందని వెల్లడైంది. వయస్సును బట్టి మధుమేహంలో హెచ్చుతగ్గులు ఉంటాయనే భావనలు కుదరవని, ఇది ప్రాంతాలు, వయస్సులు, వర్గాలకు అతీతంగా అందరికీ సోకుతుందని విశ్లేషించారు. ఇక ఇండియా విషయానికి వస్తే 10 కోట్లమందికిపైగా షుగర్‌తో బాధపడుతున్నారు.

మరో 14 కోట్ల మంది వరకూ ఈ డయాబెటిక్ జాబితాలోకి వచ్చిచేరనున్నారు. అత్యంత అధిక జనాభా గల భారతదేశంలో అసంక్రమిత వ్యాధుల సంఖ్య ఇతర దేశాలతో పోలిస్తే అత్యధికంగా ఉంటుంది. షుగర్ పట్ల ప్రజలలో పలు స్థాయిల్లో అవగావహన పెరుగుతోంది. ఇది ఒక్కసారి సోకితే ఓ పట్టాన వదిలే రకం కాదని, ఇతరత్రాపలు విధాలైన అవలక్షణాలకు దారితీస్తుందని బహుళజాతి స్థాయిల్లో ప్రచారం జరుగుతోంది. మానవాళికి ఇది అవాంచనీయ పరిణామం అవుతోంది. అయితే కట్టడికి వీల్లేకుండా పెరిగిపోవడం కలవరానికి దారితీస్తోంది. విస్ఫోటనపు స్థాయిని సంతరించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర వ్యాధులను మించిపోతోంది. ఇంతటితో ఆగకుండా ఇది ఇతరత్రా కూడా మానవీయ సమస్యలను తెచ్చిపెడుతోంది. మైనార్టీ తెగలకు, భౌగోళిక అసమానతలు, మధ్యస్థ ఆదాయపు లేదా అత్యల్ప ఆదాయాల దేశాలకు అనారోగ్య సునామీగా వచ్చి తాకుతోందని లాన్సెట్ పత్రాలలో తెలిపారు.

ఈ వ్యాధితో అలసటకు, ఏమి చేయలేని నిస్సత్తువకు, ఇది తినకూడదు అది తినాలనే పలు రకాల మీమాంసలకు దారితీస్తూ , జీవన కీలక క్రమమైన ఆలోచనలకు గండికొడుతోంది, చివరికి ప్రపంచవ్యాప్తంగా దీనితో మరణఘంటికలు ఎక్కువ అవుతున్నాయని లాన్సెట్ హెచ్చరించింది. గత వారం ఈ కీలక పత్రాలను వెలువరించారు. ప్రత్యేకించి మధ్య స్థాయి ఆదాయపు వనరులతో కొట్టుమిట్టాడే జనం ఉండే దేశాలలో డయాబెటిక్ తోకతొక్కిన విషసర్పం అవుతోంది. 2045 నాటికి ఈ దేశాలలో మూడొంతుల మంది యుక్తవయస్కులు షుగర్‌తో పోరాడాల్సి వస్తుంది. చాలీచాలని ఆర్థిక వనరులుండే ఆయా దేశాలలో ఈ వ్యాధినివారణ లేదా సంరక్షణ సంబంధిత చికిత్సలు అందించడం వీల్లేని పరిస్థితి ఉంటుంది. పది మందిలో ఒక్కరికే ఈ వ్యాధికి అవసరం అయిన మార్గదర్శకాల చికిత్స సంరక్షణలు అందుతాయి.

మిగిలినవారంతా జీవచ్ఛవాలుగా కొట్టుమిట్టాడాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మిగిల్చి వెళ్లిన గాయాలలో ఈ డయాబెటిక్ తీవ్రత కీలక విషయంగా మారింది. కొవిడ్ మహమ్మారి తరువాతి దశలలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని గుర్తించారు. ప్రపంచంలో నిజానికి ఇది ఓ తీవ్రస్థాయి అసమానతల అడ్డుగోడకు దారితీసింది. ప్రత్యేకించి మైనార్టీ వర్గాలు దీనికి గురవుతున్నట్లు గుర్తించారు. భారతదేశంలో గుండెజబ్బులు, మానసిక వ్యాధులు, డయాబెటిస్ , శ్వాసకోశ వ్యాధులు వంటి అసంక్రమిత వ్యాధులు ఎక్కువ కావడం ఆందోళన కల్గిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News