బెంగళూరు: ఓ వైద్యుడు గర్భంతో ఉన్న భార్యను చంపిన అనంతరం బంగారు ఆభరణాలను కొరియర్లో లవర్కు పంపించాడు. అనంతరం కదులుతున్న రైలు ముందు దూకి సదరు వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియురాలు కూడా ఉరేసుకున్న సంఘటన కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లా రాజరాజేశ్వర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కదూరు ప్రాంతంలో రేవంత్ అనే వ్యక్తి డెంటిస్ట్గా క్లినిక్ నడిపిస్తున్నాడు. రేవంత్ కు భార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హర్షిత అనే మహిళ తో రేవంత్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతోంది. భార్య కవితను హత్య చేసి లవర్తో జీవితం గడిపాలని నిర్ణయం తీసుకున్నాడు. గర్భంతో ఉన్న కవితను ఆభరణాల షాప్కు తీసుకెళ్లి ఆమె కోసం బంగారు నగలు కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చిన తరువాత కవిత నోట్లో గుడ్డను కుక్కి ఆమె పొట్టపై మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. కారు షెడ్లోకి కవితను తీసుకెళ్లి ఆమె గొంతును కత్తితో కోశాడు. అనంతరం కవిత దగ్గర ఉన్న ఆభరణాలను కొరియర్లో తన లవర్ హర్షితకు పంపించాడు. తన భార్యను హత్య చేసి దొంగలు ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శవ పరీక్ష నివేదికలో ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తరువాత హత్య చేశారని తేలింది. వెంటనే పోలీసులు రేవంత్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. రేవంత్ తన లవర్ హర్షితకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. కదులుతున్న ట్రైన్ ముందు దూకి రేవంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు హర్షితను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కవిత మర్డర్ ప్లాన్ వెనక హర్షిత ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో హర్షిత కూడా తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. హర్షిత భర్త సుదర్శన్ కెఎస్ఆర్ టిసిలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ మూడు కేసులను పోలీసులు మూసివేశారు.