Monday, April 29, 2024

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే?

- Advertisement -
- Advertisement -

దేశంలో ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ అయినా అలహాబాద్ యూనివర్శిటీలో విద్యార్థులు ఉద్యమ బాటపట్టారు. గత 15 రోజులుగా యూనివర్శిటీ మెయిన్ గేట్ దగ్గర ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. యూనివర్శిటీ ఆవరణలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఆందోళన చేస్తున్న క్రమంలో ఒక విద్యార్థి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ప్రశాంతంగా చదువుకోవాల్సిన విద్యార్థులు క్యాంపస్‌లో ఎందు కు ఉద్యమ బాట పట్టారు? వారి సమస్యలను పరిశీలిస్తే యూనివర్శిటీ అధికారులు ఎటువంటి చడీచప్పుడు లేకుండా, విద్యార్థులతో కనీసం చర్చ లేకుండా ఫీజులు పెంచడమే వీరి ఆగ్రహానికి కారణం. ఒకేసారి భారీ స్థాయిలో ఇప్పటికే ఉన్న ఫీజుల్లో 400% ఎక్కువ చేసి పెంచారు. గతంలో సెమిస్టర్‌కి బి.ఎ రూ. 975 ఉండగా ఇప్పుడు రూ.3701కి, బికాం రూ. 975 ఉండగా రూ. 3901 కి, బిఎస్‌సి రూ. 1175 ఉండగా రూ. 4151కి, బి.టెక్ రూ. 1941 ఉండగా రూ. 5,151కి, ఎంఎ రూ. 1375 ఉండగా రూ. 4651కి, ఎంఎస్‌సి రూ.1961 ఉండగా రూ. 6000కి, ఎల్‌ఎల్‌బి రూ. 1975 నుండి రూ. 4651కి పెంచారు. ఇంత భారీ స్థాయిలో ఫీజులను పెంచేటప్పుడు యూనివర్శిటీ పాలకమండలి సమావేశం జరపాలి. విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులతో చర్చించాలి.

కానీ ఇలాంటి ఏవీ లేకుండానే ఏకపక్షంగా కోర్స్ ఫీజులను, ఎగ్జావ్‌ు ఫీజులను పెంచారు. దీంతో యూనివర్శిటీ విద్యార్థులు కడుపుమండి తీవ్రస్థాయిలో స్పందించి ఆందోళన బాటపట్టారు. కనీసం యూనివర్శిటీ విద్యార్థులకైన ఉచితంగా విద్యను అందించలేని దీనస్థితిలో యోగి, మోడీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఉచిత విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత. కానీ నేడు ఆ బాధ్యత నుండి క్రమంగా తప్పుకున్నాయి. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ పట్టణంలో ఉన్న యూనివర్శిటీలో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతం నుండే వచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు. ఇప్పుడు ఈ యూనివర్శిటీ విద్యార్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలు యోగి, మోడీ ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక ఇరకాటంలో పడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు భారీ స్థాయిలో పెంచారు. దీంతో మా బతుకులు ఛిద్రం అయినాయి. మా బతుకులు దినదిన గండం అయ్యాయి. విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరంగా బతుకుతున్నాం.

ఇప్పుడు ఈ ఫీజుల భారం మోపి మమ్మల్ని విద్యకు కూడా దూరం చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. ఈ యూనివర్శిటీలో అధికారులు, ప్రజాప్రతినిధుల బిడ్డలు చదివితే మా ఆవేదన ఏంటో అర్థం అవుతుంది అంటున్నారు. అవును నిజమే వారు అంతా పేద కుటుంబాల వారే వారి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. కార్పొరేట్ శక్తులకు రుణమాఫీలు, రాయితీలు కల్పిస్తున్న బిజెపి నేతృత్వంలోని మోడీ, యోగి ప్రభుత్వాలు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, కూలీ బిడ్డలపై ఫీజుల పిడుగులను వేస్తున్నాయి. వాస్తవానికి గత రెండున్నర సంవత్సరాలుగా ప్రపంచమంతా కరోనాతో కకావికలం అయింది. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మృగ్యం అయినాయి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే కుదటపడుతున్న సమయాన విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం వారిని ఉన్నత విద్యకు దూరం చేయడమే.

కేంద్రంలో, రాష్ర్టంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివద్ధిలో దూసుకుపోతామని మభ్యపెడుతున్న బిజెపి పార్టీ విద్యార్థులను చదువులకు దూరం చేయడం సిగ్గుచేటు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ ‘మోడల్ అభివద్ధి’ అంటూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే ఇదే రకమైన అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ ప్రగల్భాలలోని డొల్లతనం యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనతో మరోసారి బయటపడ్డాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో, రాష్ర్టంలో అధికారంలో ఉండి బడుగులకు ఉన్నత విద్యను దూరం చేయడమే అనేది స్పష్టమవుతుంది. అభివృద్ధి అంటే కార్పొరేట్ల శక్తుల అభివృద్ధి కాదు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలను అందిపుచ్చి వారిని జీవితంలో ఉన్నత స్థానంలో ఉంచాలి. అందుకు విద్య చోదక శక్తిగా ఉంటుంది. అటువంటి విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడం మోడీ, యోగిల కుట్ర.

కరోనా కష్టకాలంలో ప్రజలకు, విద్యార్థులకు రాయితీలు కల్పించి విద్య, ఉపాధి, జీవన ప్రమాణాలు పెంచాలి. కానీ ఈ కష్ట కాలాన్ని ఆసరా చేసుకొని ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలను బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ప్రజలపై మోపింది. దానిలో భాగంగానే కార్మిక చట్టాలకు సవరణలు చేసింది. విద్యుత్ బిల్లును తీసుకొచ్చింది. కార్పొరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. దీనికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, ప్రజలు పోరాడారు. వీటితో పాటే విద్యను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకొచ్చింది. దీని ద్వారా ఉన్నత విద్య అంతా మరింత కార్పొరేటీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణ అవుతుంది. పేదలకు విద్య దూరమవుతుంది. దీన్ని అమలు చేయరాదని దేశంలో విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు ఉద్యమిస్తున్నారు. అయితే అలహాబాద్ యూనివర్శిటీలో ఫీజులు పెంచడం నూతన జాతీయ విద్యా విధానంలో భాగమే అని ఛాన్సలర్ సంగీత శ్రీవాత్సవ్ పేర్కొన్నారు.

దీనికి అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని, అందుకే ఫీజులు పెంచామని చెప్తున్నారు. అంటే ఫీజులను పెంచడానికి అనుమతిస్తున్న జాతీయ విద్యా విధానం ఏ వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందో బిజెపి నేతృత్వంలోని మోడీ, యోగి ప్రభుత్వాలే చెప్పాలి. దేశానికి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు విద్యావేత్తలతో, మేధావులతో, ప్రొఫెసర్లతో యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్‌లతో సమావేశం ఏర్పాటు చేసి విద్యను పేదలకు మరింత అందుబాటులో తీసుకురావడం కోసం, ఏ విధానాలు అవలంబిస్తే మంచి జరుగుతుందో అవి చేయాలి. ఎవరితో సంప్రదింపులు లేకుండా, పార్లమెంట్‌లో కూడా చర్చించకుండా, కార్పొరేట్ నూతన జాతీయ విద్యా విధానం రూపొందించి అమలుకు పూనుకుంది. దీని దుష్పరిణామాలను ఇప్పుడు అలహాబాద్ యూనివర్శిటీలో పెంచిన ఫీజుల రూపంలో చూస్తున్నాం. జాతీయ విద్యా విధానం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతుంది. దేశంలో ఇంత వరకు ఏ ఒక్క ప్రభుత్వ యూనివర్శిటీ గాని, రీసెర్చ్ సెంటర్ గాని నెలకొల్పని మోడీ ప్రభుత్వం ఫీజులను పెంచి దేశ విద్యారంగంపై, విద్యార్థులపై సర్జికల్ స్ట్రైక్ చేయడం దారుణం.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశభక్తి ముసుగులో అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను దేశంలో ఉన్న యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. జెఎన్ యు, జామియా మిలియా, బెనారస్, ఢిల్లీ యూనివర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఇప్పుడు ఇది అలహాబాద్ యూనివర్శిటీకి చేరుకుంది. వీరి కార్పొరేట్ అనుకూల విధానాలపై పోరాడుతున్న, ప్రశ్నిస్తున్న అనేక మంది విద్యార్థులను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు.

పోలీస్ దుస్తుల్లో యూనివర్శిటీల్లోకి చొరబడి మోడీ అనుచరగణం విద్యార్థులపై దాడులు చేసున్నది. ఇప్పుడు సమస్యలు పరిష్కరించాలని అడిగిన అలహాబాద్ యూనివర్శిటీ విద్యార్థులపై అదే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. కనీసం నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం లేదు. ఉవ్వెత్తిన లేస్తున్న విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. చదువుకొని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన విద్యార్థులు వీరి దాష్టీకాలను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు మానసికంగా ధైర్యాన్ని కోల్పోకుండా మరిన్ని అఘాయిత్యాలు జరగకుండా వెంటనే యూనివర్శిటీ అధికారులు, ఆ రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. పెంచిన ఫీజులను వెనక్కి తీసుకోవాలి. లేకుంటే విద్యార్థులే మోడీ, యోగి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.

పి.మహేష్
9700346942

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News