హైదరాబాద్: బిజెపికి రాజకీయాలు తప్ప పేదల ప్రాణాలు కాపాడే ఆలోచన లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. మతాల చుట్టూ రాజకీయాలు చేస్తూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చి వేసేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తుందే కానీ కరోనా నియంత్రణకు కృషి చేయడంలేదని మంత్రి ఈటెల ఆరోపించారు. ఆదివారం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. జన్సంవాద్ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా, ఇతరనాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై ఆరోపణలు చేసేముందు బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందేమిటో ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకులు సరిచూసుకోవాలని ఈటెల అన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాకముందే టిఆర్ఎస్ అన్నిచర్యలు ప్రారంభించిందని చెప్పారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తున్నా కేంద్రం రాష్ట్రానికి సహకరించడంలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావల్సిన కరోనా టెస్ట్ మిషనరీని ఇతరరాష్ట్రాలకు కేంద్రం తరలించిందని ఆయన ఆరోపించారు. ఈ విషయానికి బాధ్యతలు లేకుండా మాట్లాడుతున్న నడ్డా సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కేంద్రం కేవలం 2 లక్షల ఎన్95 మాస్కులు, పిపిఇ కిట్లు బిచ్చం వేసినట్లు ఇచ్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావల్సిన టెస్టులు చేసే యంత్రాలను కోల్కత్తకు తరలించి కేంద్రప్రభుత్వం ద్రోహంచేసిందని దుయ్యబట్టారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 14లక్షల ఎన్95 మాస్కులు, 10లక్షల పిపిఇ కిట్లు సమకూర్చుకుని కరోనాతో పోరాటం చేస్తోందని ఆయన తెలిపారు. ఐసిఎంఆర్ నిబంధనల మేరకే లక్షణాలు లేనివారిని హోమ్ ఆసోలేషన్లో ఉండమంటున్నామని ఈటల స్పష్టం చేశారు.
Etela Rajender fires on JP Nadda Comments