Saturday, April 27, 2024

ఉత్సాహంగా భట్టి పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : సిఎల్‌పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా, తల్లంపాడుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, భద్రాచలం ఎంఎల్‌ఎ పొడెం వీరయ్య కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మాజీ ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ చందా లింగయ్యదొర, డాక్టర్ మట్టా దయానంద్, మానవతా రాయ్ తదితరులు సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో అడుగులో అడుగేసి కదిలారు.

పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు నేను రెడీ : భట్టి

కాంగ్రెస్ హయాంలో ఇందిర, రాజీవ్ సాగర్ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయితే 10 సంవత్సరాలు కావస్తున్న మిగతా 20శాతం పనులు ఎందుకు పూర్తి చేయలేదని సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కూసుమంచిలో జరిగిన కార్నర్ సభలో ఆయనమాట్లాడుతూ రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది కానీ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో 25 వేల కోట్ల రూపాయలకు పెంచి పది సంవత్సరాలు కావస్తున్న ఒక్క ఎకరానికి కూడా చుక్క నీరు ఇవ్వని బిఆర్‌ఎస్ వైఫల్యంపై చర్చకు నేను సిద్ధం అని ఆయన అన్నారు. ఈ అంశంపై మాట్లాడడానికి దమ్ము, ధైర్యం ఉంటే బిఆర్‌ఎస్ పాలకులు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిర, రాజీవ్ సాగర్ మాత్రమే కాదు ఆదిలాబాద్‌లో ఉన్న కొమరం భీం, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మాణం చేసిన 63 చెరువుల నుంచి పంట పొలాలకు సాగునీరు వెళ్లడానికి కాలువలు తవ్వకుండా చూస్తున్నారా? ప్రాణహితను చంపేసి కాలేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా?దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి జల యజ్ఞంలో ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తే బిఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని అడవి నుంచి ఖాళీ చేయించే కుట్ర చేస్తుందన్నారు. సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టారని, 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ లక్ష్యాలు నెరవేర్చలేదన్నారు. అభివృద్ధి అంటే కాంగ్రెస్ హయాంలో వేసిన రోడ్ల మధ్యన డివైడర్లు కట్టి, కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి, కలర్లు వేస్తే అభివృద్ధి అవుతుందా? అని ఆయన నిలదీశారు. అభివృద్ధి అంటే నాగార్జున్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టాలి .స్పాంజ్ ఐరన్ కంపెనీలు తీసుకురావాలి.

సింగరేణి సంస్థ ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించాలి్ కొత్త పవర్ ప్రాజెక్టు సంస్థలు తీసుకురావాలి. ఇండ్లు లేనివారికి ఇండ్లు, కొలువులు, విద్య, వైద్యం, ఉద్యోగాలు లేని యువతకు స్వయం ఉపాధి ద్వారా రుణాలు ఇచ్చి వారి జీవన ప్రమాణాలు పెంచడం నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు.ఖమ్మం జిల్లాకు బిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి ఏంటి? 10 ఏండ్ల పరిపాలనలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేశారా? కొత్త పరిశ్రమ తీసుకువచ్చారా? కొత్తగా కొలువులు ఇచ్చారా? బిఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదు గుండు సున్నాఅని ఆయన అన్నారు. పాలేరు నియోజకవర్గ ప్రజల ఓట్లను కాంట్రాక్టుల కోసం కెసిఆర్ వద్ద ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అమ్ముడు పోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళితే బాగుండేదన్నారు.గతంలో పాలేరు నుంచి శాసనసభ్యులుగా గెలిచిన సంభాని చంద్రశేఖర్, రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు ఏనాడు ప్రజల ఓట్లను కందల ఉపేందర్ రెడ్డి లాగా అమ్ముకోలేదన్నారు.

వారు పాలేరుకు నాగార్జునసాగర్ జలాలు తీసుకొచ్చేలా చేశారు. ఇండ్లు లేని పేదలకు ఇల్లు ఇప్పించారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. పాలేరు ప్రజలు తలెత్తుకొనే విధంగా పనిచేశారు. కానీ, కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టుల కోసం కేసీఆర్ కాళ్ళ వద్ద మోకరిల్లిన ప్రజాస్వామ్య ద్రోహి అని కందాల ఉపేందర్ రెడ్డి అని ఆయన విమర్శించారు. నాలుగు నెలలు ఆగితే నిన్ను నీ పార్టీని పాలేరు ప్రజలు బంగాళాఖాతంలో పడేస్తారన్నారు. కూసుమంచి పాదయాత్ర వేదిక నుంచి ఏసీపిని హెచ్చరిస్తున్నా… ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం. పోలీస్ రాజ్యం కాదన్నారు. ఏసిపి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసు. మీ ఆస్తులు తెలుసు. మీరు పోలీస్ మాన్యువల్ ప్రకారంగా పనిచేయకుండా సంఘవిద్రోహ శక్తులను అరెస్టు చేసినట్లు అర్ధరాత్రి మండల కాంగ్రెస్ నాయకులు ఇంటికి ఎలా వెళ్తావు.

మీలాంటి పోలీసుల గురించి చిట్టా రాస్తున్నాం. కాంగ్రెస్లో అధికారంలోకి రాగానే చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి“ అని అన్నారు.పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అయితే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని మీలాంటి పోలీసుల గురించి ఇటీవల సీఎం కేసీఆర్ కు లేఖ రాశానన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జూలై రెండున ఖమ్మంలో నిర్వహించే జనగర్జన సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. ఇదే సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక ఉంటుంది. ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్

పాలేరు నియోజకవర్గం తల్లంపాడు గ్రామం నుంచి శుక్రవారం సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం అవుతుంది. తల్లంపాడు, మద్దులపల్లి కోదాడ క్రాస్ రోడ్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. తల్లంపాడు గ్రామం దాటిన తర్వాత పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది. ఆ తర్వాత కార్నర్ మీటింగ్ జరుగుతుంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్, పాలేరు ఇంచార్జ్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎంఎల్‌సి పొట్ల నాగేశ్వరరావు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, అనుబంధ సంస్ధల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News