Saturday, May 11, 2024

వరుస రైలు ప్రమాదాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరుస రైలు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాదం మరవకముందే మరికొన్ని సంఘటన చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ఉదయం సికింద్రాబాద్- అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. అలాగే సీల్దా- అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగగా, ఒడిస్సాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతోపాటు చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీకి పగుళ్లు ఏర్పడడంతో వెంటనే సిబ్బంది దానిని గుర్తించడంతో పెనుప్రమాదం తప్పిందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇలా ఒడిస్సా రైల్వే ప్రమాదం తరువాత వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
బి5 కోచ్ నుంచి పొగ
సికింద్రాబాద్ నుంచి అగర్తలా వెళ్తున్న రైలు బ్రహ్మపుర స్టేషన్‌కు చేరుకోగానే బి5 కోచ్‌లో మంటలు చెలరేగాయి. రైలులో పొగ రావడం చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైలులో ప్రయాణిస్తున్న కొంతమంది బి5 కోచ్ నుంచి పొగ రావడం చూసి అత్యవసరంగా అలారంను మోగించారు. మరికొంత మంది రైలునుంచి దిగి అందులో ప్రయాణించేది లేదని తేల్చి చెప్పారు. తక్షణమే మరొక కోచ్‌ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. ఎయిర్ కండిషనర్‌లో జరిగిన చిన్న షాట్ సర్య్కూట్ వల్ల కోచ్‌లో పొగ ఏర్పడి ఉండవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
సీల్దా- అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
సీల్దా- అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలులో ఉన్న ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా మీదుగా సీల్దా- అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు చెప్పారు.
ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఒడిశాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలు బార్గఢ్ వద్ద పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గూడ్స్ రైలుతో రైల్వే శాఖకు సంబంధం లేదు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలును ఓ ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీ నడిపిస్తోందని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. మెందపాలి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే రైలు పట్టాలు తప్పిందని వివరించింది. దాంతో రైల్వే శాఖకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
రైలుకు పగుళ్లు.. తప్పిన ప్రమాదం
తమిళనాడులో ఓ రైలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కొల్లం జంక్షన్- చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీ కింది భాగంలో ఏర్పడిన పగుళ్లను తమిళనాడులోని సెంగోట్టై రైల్వే స్టేషన్‌లో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లు దక్షిణ రైల్వే అధికారులు పేర్కొన్నారు. పగుళ్లను గుర్తించిన రైల్వే సిబ్బంది ఆ బోగీని తొలగించి మధురైలో ప్రత్యామ్నాయంగా మరో బోగీని జోడించారు. చెన్నై- ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ త్రీ బోగీలో పగుళ్లను క్యారేజ్ వ్యాగన్ సిబ్బంది గుర్తించారు. పగుళ్లను గుర్తించిన సిబ్బందిని సత్కరించి అవార్డును అందజేయనున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News