Saturday, April 27, 2024

ఆ రైలు జీవితకాలం ఆలస్యం!

- Advertisement -
- Advertisement -

276 నెలలుగా
కొనసాగుతున్న
మునీరాబాద్-
మహబూబ్‌నగర్
రైల్వే మార్గం పనులు
ఆలస్యమైన రైల్వే
ప్రాజెక్టుల్లో దేశంలో
తొలి స్థానం రోడ్డు
రవాణా రంగంలో
నత్తనడకన
248 ప్రాజెక్టులు
కేంద్ర ప్రభుత్వ తాజా
నివేదిక వెల్లడి

హైదరాబాద్ : మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు పలు రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు నత్తనడకన కొనసాగుతున్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యం త ఆలస్యంగా కొనసాగుతోన్న ప్రాజెక్టులు రైలు, రోడ్డు రవాణా రంగంలోనే అధికం గా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. రోడ్డు రవాణా రంగంలో వాస్తవ షెడ్యూల్ ప్రకారం మొత్తం 831 ప్రాజెక్టులు పర్యవేక్షణలో ఉండగా, వాటిలో 248 ప్రాజెక్టులు ఆలస్యంగా కొనసాగుతున్నట్టు పేర్కొంది. రైల్వేలో పలు ప్రాజెక్టులు అత్యంత ఆలస్యంగా కొనసాగుతున్నాయి. ఇందులో 173 ప్రాజెక్టులకు గాను 116 ప్రాజెక్టుల్లో పనులు నత్తనడకన సాగుతున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. పెట్రోలియం రంగంలో 139 ప్రాజెక్టులకు 88 ఆలస్యంగా కొనసాగుతున్నట్టు తెలిపింది. దేశంలో అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న రైల్వే ప్రాజెక్టుగా మునీరాబాద్ – మహబూబ్ నగర్ మార్గం తొలిస్థానంలో నిలిచింది. ఈ ప్రాజెక్టు 276 నెలల ఆలస్యంగా కొనసాగడం గమనార్హం. బెలాపుర్-సీవుడ్ అర్బన్ ఎలక్ట్రిఫైడ్ డబుల్ లైన్ రెండో స్థానంలో నిలవగా, గత 228 నెలలుగా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. అత్యంత ఆలస్యంగా సాగుతోన్న ప్రాజెక్టుల జాబితాలో కోటిపల్లి నర్సాపూర్ రైల్ ప్రాజెక్టు మూడో స్థానంలో ఉంది. 216 నెలలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది.

రైల్వేల్లో 173 ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.3,72,761 కోట్లు కాగా ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు రూ.6,19,569 కోట్లు కానున్నట్టు అంచనా. రోడ్డు రవాణా, హైవేల విషయానికొస్తే మొత్తంగా 831 ప్రాజెక్టులు, వాటి అనుమతులు వచ్చినప్పుడు అంచనా వ్యయం రూ.4,92,741 కోట్లుగా ఉంది. ఆలస్యం కారణంగా ఇవి పూర్తయ్యేందుకు అయ్యే వ్యయం రూ. 5,40,815 కోట్లకు పెరిగినట్టు అంచనా. దాదాపు 9.8 శాతం పెరుగుదల కనిపించింది. ఆగస్టు 2022 నాటికి వీటికి రూ. 3,21,001 కోట్లను ఖర్చు చేశారు. అంచనా మొత్తంలో ఇది 59.4 శాతం. ఇక పెట్రోలియం రంగంలో 139 ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 3,66,013 కోట్లు కాగా, ఇవి పూర్తయ్యేనాటికి రూ. 3,86,263 కోట్లు కానున్నట్టు లెక్క కట్టారు. అంచనా వ్యయంలో ఇప్పటి వరకు రూ.1,36,450 ఖర్చు చేసినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే రూ. 150 కోట్ల వ్యయానికి పైగా ఖర్చయ్యే ప్రాజెక్టులను కేంద్ర గణాంకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు మోనిటరింగ్ విభాగం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను అమలు చేస్తోన్న ఏజెన్సీలు ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ మోనిటరింగ్ సిస్టమ్ లో పొందుపరిచే సమాచారాన్ని బట్టి వీటి పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఈ క్రమం లోనే అత్యంత ఆలస్యంగా కొనసాగుతోన్న ప్రాజెక్టుకు సంబంధించి తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News