Monday, April 29, 2024

దశాబ్ది కానుక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే వివిధ అలవెన్స్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీయనెన్స్ అలవెన్స్ 30 శాతం, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ అలవెన్స్‌ను కూడా 30 శాతానికి పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ.150 చెల్లించాలని ఆర్థిక శాఖ తెలిపింది. షెడ్యూల్ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్‌ను 30 శాతం పెంచారు. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు పెంచుతూ ఈ మేరకు ఆర్థిక శాఖ సిఎం ఆదేశాల మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు, కారు, మోటార్ సైకిల్ కొనుగోలు చేసే ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది.

ఇళ్ల నిర్మాణానికి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు
ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలకు, మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లకు సంబంధించి కూడా అడ్వాన్స్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్‌ను ఒక లక్ష నుంచి రూ.4 లక్షలకు ప్రభుత్వం పెంచింది.

పెన్షనర్లు మరణిస్తే ఆర్థిక సాయం పెంపు
అలాగే కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ.75 వేల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్‌ను 30 శాతానికి ప్రభుత్వం పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పే కూడా 2020 పే స్కేల్ ప్రకారం వర్తించనుందని ఆర్థిక శాఖ పేర్కొంది. పెన్షనర్లు మరణిస్తే అందించే తక్షణ సాయం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. ఫ్రొటోకాల్ విభాగంలో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15 శాతం స్పెషల్ పే మంజూరు చేస్తూ సిఎం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్థిక శాఖ ఈ మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News