జూలై 31 వరకు ప్రత్యేక కెసిసి కార్యక్రమాలు
రూ.3 లక్షల వరకు రుణం.. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులకు లబ్ధి
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఆర్థికంగా కుదేలైన పాడి రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక కిసాన్ క్రెడిట్ ప్రత్యేక కార్యక్రమాన్ని వచ్చే నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ఆర్థిక సహకారం అందించనున్నారు. దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి సంఘాలు, సంస్థలకు చెందిన దాదాపు కోటిన్నర మంది పాడి రైతులకు లబ్ది చేకూరేలా కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసిసి)ను జారీ చేస్తోంది.
రాష్ట్రంలో విజయ డెయిరీతో కలిపి దాదాపు మూడు లక్షల మంది పాడి రైతులు ఉన్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమంలా దీనిని చేపడుతున్నారు. ఆర్థిక సేవల విభాగంతో కలిసి పశుసంవర్థక శాఖ కెసిసికు సంబంధించిన సర్కులర్ను జారీ చేసింది. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల పాల ఉత్పత్తి ఫెడరేషన్లు, సంఘాలకు దరఖాస్తు నమూనాను పంపింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 230 పాల ఉత్పత్తి సంఘాల్లో కోటి 70 లక్షల మంది రైతులు ఉన్నారు. పాల ఉత్పత్తి సహకార సంఘాలు, వివిధ యూనియన్లలో సభ్యులుగా ఉండి కెసిసి లేని రైతులను గుర్తించి, వారందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్షంగా ఉంది. భూ యజామాన్యం ఆధారంగా ఇప్పటికే కెసిసి పొందిన రైతులకు పరపతి పరిధిని పెంచుతారు.
అయితే వడ్డీ మాఫీ వెసులుబాటు మాత్రం రూ.3 లక్షల వరకే వర్తిస్తుంది. రైతుల నుంచి ఎలాంటి భరోసా తీసుకోకుండా జారీ చేసే సాధారణ కెసిసిల పరపతి పరిధి రూ.1.6 లక్షలు మాత్రమే ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పాడి రైతు నేరుగా బ్యాంకు నుంచి రూ. లక్షా 60 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందే అవకావం ఉంటుంది. తమ దరఖాస్తులను ఆయా సొసైటీల్లో అందజేయాల్సి ఉంటుంది. దీంతో పాడి రైతులకు మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం లీటరుకు రూ.4 ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది. 50 శాతంపై సబ్సిడీపై పాడి పశువులను అందజేస్తుంది.