Monday, April 29, 2024

ఉల్లి ఎగుమతులపై మార్చి వరకు నిషేధం

- Advertisement -
- Advertisement -

ధరల కట్టడికి కేంద్రం నిర్ణయం
నిషేధాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలో ఉల్లి రైతుల రాస్తారోకో

న్యూఢిల్లీ: దేశీయ లభ్యతను పెంచి, ధరలను నియంత్రించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 2024 మార్చి వరకు ఉల్లి ఎగుమతి విధానాన్ని సవరించినట్లు విదేశీ వర్తక డైరెక్టరేట్ జనరల్(డిజిఎఫ్‌టి) శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో తెలిపారు. ధిల్లీలో స్థానిక వ్యాపారులు ఉల్లిని కిలో రూ. 70 నుంచి రూ. 80 మధ్య విక్రయిస్తున్నారు. కాగా..దేశంలో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో నిల్వలో ఉంచిని ఉల్లిని రిటేల్ మార్కెట్‌కు తరలించి కిలో రూ. 25 వంతున విక్రయించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఉల్లి ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఇదివరకు అనేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతులపై కనీస ఎగుమతి ధర(ఎంఇపి)ను టన్నుకు 800 డాలర్లుగా విధించింది. డిసెంబర్ 31 వరకు ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ ఆగస్టులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే అభ్యర్థనలకు ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకు ఉల్లి ఎగుమతిని నుమతిస్తామని డిజిఎఫ్‌టి తెలిపింది. తాజా నోటిఫికేషన్ వెలువడడానికి ముందే విదేశాలకు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న ఉల్లిని అనుమతించనున్నట్లు తెలిపింది.

మహారాష్ట్రలో ఉల్లి రైతుల నిరసన
ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడంతో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులు ముంబై-ఆగ్రా హైవేపై మూడు చోట్ల శుక్రవారం రాస్తారోకోలు నిర్వహించారు. హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి వేలం పాటలను నిలిపివేశారు. అసల్‌గావ్, చాంద్వాడ్, నంద్‌గావ్, దిండోరి, ఏవ్లా, ఉమరానేతోపాటు నాసిక్ జిల్లాలోని ఇతర ప్రదేశాలలో ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి వేలంపాటలను రైతులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

అసల్‌గావ్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఎపిఎంసి)లో ఉల్లి ఆక్షన్లు జరగలేదని, కాని వించూర్, నిఫడ్ సబ్ కమిటీలలో మాత్రం జరిగాయని ఒక అధికారి చెప్పారు. వించూర్ మార్కెట్‌కు శుక్రవారం ఉల్లి లోడుతో 600 వాహనాలు వచ్చాయని, క్వింటాలుకు కనిష్ఠ ధర రూ. 1,500 ఉండగా గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 3,300 ఉందని అధికారి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News