Saturday, April 27, 2024

రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు

- Advertisement -
- Advertisement -

Greta Thunberg, Rihanna tweeted in support of the farmers

 

జాబితాలో పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్, హాలీవుడ్ స్టార్ రిహన్నా
తిప్పికొట్టిన బాలీవుడ్ నటి కంగన
సెలెబ్రిటీల ట్వీట్లపై భగ్గుమన్న విదేశాంగ శాఖ

న్యూఢిల్లీ/లండన్ : ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్‌బర్గ్, హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా చేరారు. రైతులకు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘మేము రైతులకు సంఘీభావంగా నిలబడతాం’ అంటూ ఇంటర్నెట్ సేవల నిలిపివేత వార్తకు సమాధానంగా గ్రెటా ట్వీట్ పెట్టారు. ట్విట్టర్లో 100 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న రిహన్నా అన్నదాతలు చేస్తోన్న ఉద్యమంపై స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో రైతుల ఉద్యమానికి సంబంధించని ఓ న్యూస్ ఆర్టికల్ క్లిప్‌ని షేర్ చేస్తూ.. మనం ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.

రిహన్నా ట్వీట్ స్క్రీన్‌షాట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన బ్రిటన్ ఎంపీ క్లౌడియా ‘భారత రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నాను. రాజకీయ నాయకత్వం లోపించిన తరుణంలో ఇతరులు ముందుకు రావడం అభినందనీయం. రిహన్నాకు ధన్యావాదాలు’ అని ట్వీట్ చేశారు. ఇక రిహన్నా ట్వీట్‌కు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఘాటైన సమాధానం ఇచ్చారు. ‘దీని గురించి ఎవరు మాట్లాడటంలేదు ఎందుకంటే వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు. వీరు దేశాన్ని విభజిస్తే.. చైనా దాన్ని స్వాధీనం చేసుకుని అమెరికా లాంటి ఓ కాలనీని తయారు చేయాలని ఎదురు చూస్తోంది. నోర్మూసుకుని కూర్చో ఫూల్.. మీలాంటి డమ్మీలకు మా దేశాన్ని అమ్మం’ అంటూ కంగనా సమాధానం ఇచ్చారు.

భగ్గుమన్న విదేశాంగ శాఖ

రైతు నిరసనపై వివిధ రంగాలకు చెందిన సెలెబ్రెటీలు ట్వీట్లు చేయడంపై భారత విదేశాంగ శాఖ భగ్గుమంది. వాటికి ఏమాత్రం కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యం. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా బాధపడింది.’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News