Sunday, April 28, 2024

ఆరోగ్య తెలంగాణ లక్షం

- Advertisement -
- Advertisement -
  • వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి
  • గర్భిణుల ఆరోగ్యం కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

మెదక్: వైద్య సిబ్బంది సేవలు అనన్య సామాన్యమని, వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని మాయా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వైద్యారోగ్య దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టరం రాజర్షిషా, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెసిఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ప్రారంభిస్తూ 20 మంది గర్భిణులకు అందజేశారు. ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో రోగుల బి.పి.ని పరీక్షించుటకు డిజిటల్ బిపి మిషన్లను అందజేశారు. ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ సాధించిన ప్రగతిపై కరపత్రాలను ఆవిష్కరించగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందునాయకం ప్రగతి నివేదిక చదివి వినిపించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎంత సంపాదించిన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వృధా అని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం గర్భిణిలలో అనీమియా తగ్గించుటకు ఆరోగ్యవంతమైన బిడ్డను జన్మనిచ్చేందుకు విటమిన్లతో కూడిన పౌష్టికాహార కేసీఆర్ కిట్లను అదజేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వైద్య విధానంలో మార్పులు తెచ్చి ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ అవసరమైన సిబ్బందిని నియమించి బలోపేతం చేస్తూ ఆరోగ్య తెలంగాణ దిశగా తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలు అమలుపరుస్తుందన్నారు.

ప్రతి ఆరోగ్య ఉప కేంద్రానికి నూతన భవనాలు నిర్మిస్తుందని తెలిపారు. నీతి అయోగం విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్‌లో తెలంగాణ రాష్ట్రం ఓవరాల్ ర్యాంకింగ్‌లో 3వ స్థానంలో, వ్యాక్సినేషన్, ప్రసవాల పురోగతిలో టాప్‌లో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వనప్పడికీ ఆరోగ్య తెలంగాణలో భాగంగా ముఖ్యమంత్రి 33 జిల్లాలకు మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేశారని, ఇప్పటివరకు 21 జిల్లాలో మెడికల్ కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. మన జిల్లాలో త్వరలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసుకోవడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించుకోనున్నట్లు పేర్కోన్నారు.

రాత్రింబవళ్లు వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని, కరోనా కాలంలో వారి సేవలు మరువరానివని కొనియాడారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఒకేరోజు 25 ప్రసవాలు నిర్వహించి రికార్డు నెలకొల్పారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైద్య సిబ్బంది కృషి వల్ల నేడు 81 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, శిశు మరణాలు కూడా తగ్గాయని, సి సెక్షన్ ఆపరేషన్లు కూడా 65 శాతం నుండి 45 శాతం తగ్గించామని, ఇంకా తగ్గించడానికి కృషి చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సిఎం కెసిఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావులు అహర్నిషలు శ్రమిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందన్నారు.

ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకొని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామనడం, నీతి అయోగం కూడా మన కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని పేర్కోన్నారు. జిల్లాలో ఆసుపత్రులను బలోపేతం చేస్తూ మాతా శిశు సంరక్షణ కేంద్రం ద్వారా అత్యాధిక సంఖ్యలో సాధారణ ప్రసవాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో డయాలసిస్ కేంద్రం, ఐసీయూ యూనిట్ ప్రారంభించుకోవడంతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు తెలిపారు. రెండవ విడత కంటి వెలుగు ద్వారా జిల్లాలో 4లక్షల 70వేల మందిని పరీక్షించి 49 వేల ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశామన్నారు.

102, 108 ఆంబులెన్స్‌ల ద్వారా సేవలందిస్తున్నామని తెలిపారు. వైద్య సిబ్బంది ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా బాగా పని చేస్తూ జిల్లాను అన్ని పారామీటర్లలో అగ్రభాగాన నిలపాలని కోరారు. అనంతరం అతిథులు బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన నలుగురు ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్లు ప్రధానం చేయడంతో పాటు వైద్య రంగంలో ఉత్తమ సేవలందించిన వైద్యులు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు తదీతరలుకు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో సన్మానించారు. అంతకు ముందు ఎమ్మెల్యే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మేన్ చంద్రపాల్, డిఎం అండ్ హెచ్‌వో చందునాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డా. శివదయాల్, చంద్రశేఖర్, నవీన్, పిహెచ్‌సి వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News