Monday, April 29, 2024

రాష్ట్రంలో జోరుగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

heavy rainfall in telangana state

హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు వారాల పాటు జోరుగా వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు వారాల పాటు అధికారులు పూర్తిస్థాయిలో క్షేత్రంలో ఉండాలని, ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. వర్షాల కోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారులకు బాధ్యత అప్పగించాలని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు కమిషనర్లు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తూ పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని సూచించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం నాడిక్కడ సిడిఎంఎ, జిహెచ్‌ఎంసి, జలమండలి ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిహెచ్‌ఎంసితో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదవుతుందని కేవలం హైదరాబాద్ నగరంలోనే గత పది రోజుల్లో యాభై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అధికారులు వివరించారు. ఇంత పెద్ద ఎత్తున వర్షాలు గతంలో ఎప్పుడూ లేదని తెలియజేశారు. ఇంత భారీ వర్షపాతం రోజంతా కాకుండా కేవలం 1, 2 గంటల్లోనే కుండపోతలా వర్షం పడటం వలన అక్కడక్కడ నీళ్లు పేరుకుపోతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇంత భారీ వర్షాలు లోనూ పురపాలక శాఖ అధికారులు వెంటనే స్పందించి సాధ్యమైనంత సహాయక చర్యలు చేపడుతున్న విషయాన్ని వారు ప్రస్తావించారు.

ఇప్పటి వరకు పడిన వర్షాల వలన జరిగిన రెండు సంఘటనలో ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు.
అనంతరం మంత్రి కెటిఆర్ స్పందిస్తూ, ఇలాంటి విపత్కార పరిస్థితుల్లో అధికారుల సమర్ధత బయటపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తగా, మరింత శరవేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగొద్దని సూచించారు. ఇదే సమయంలో కూలి పోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే గుర్తించాలన్నారు. ఈ భవనాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ఇప్పటికే గుర్తించిన ఇలాంటి భవనాలను మరింత వేగంగా కూల్చాలని ఆదేశించారు. దీంతో పాటు భవన నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో జాగ్రత్త గా ఉండేలా ప్రైవేట్ కాంట్రాక్టర్‌లకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టిన కార్యక్రమాల నేపథ్యంలో తవ్విన గుంతల చుట్టూ కంచె వేయాలని సూచించారు.

ఇప్పటికే గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్లలో ప్రత్యేక బృందాలను పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో 170 వర్షాకాల అత్యవసర బృందాలు పని చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు. వర్షాల వలన పాడవుతున్న రోడ్లను వెంట వెంటనే మరమ్మతు చేసేలా చర్యలు తీసుకోవాలని, వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత యుద్ధప్రాతిపదికన రోడ్లన్నీ పూర్వస్థితికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దోమలు ప్రబలకుండా ఎంటమాలజీ విభాగాలను మరింత ఆక్టివేట్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News