Monday, April 29, 2024

12నుంచి తెలంగాణలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి. వాతారణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరం రికార్డ్ స్థాయి వర్షపాతంతో తడిసి ముద్దవుతోంది. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పొరుగునే ఉన్న కర్ణాటకను ఇప్పటికే మేఘాలు కమ్మేశాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 24గంటలుగా వాతావరణం మారుతూ వస్తోంది. ఈ నెల 12నుంచి 5రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ఉత్తర , ఈశాన్య జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది.

సోమవారం దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24గంటల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 12,13 తేదిల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 11వ తేదిన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఈ నెల 12న కొమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల, కంరీనగర్, పెద్దపల్లి, జయశంకర్ బూపాలిపల్లి, ములుగు, వరంగల్ , హన్మకొండ జిల్లాల్లో ఉరుములు ,మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ,ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 13 న కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ ,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 14న కొమరంభీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

హైదరాబాద్ మేఘావృతం!

గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాలకు వాతావరణ కేంద్రం ప్రత్యేక వర్ష సూచన చేసింది.రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు , 24డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశాలు ఉన్నాయని, గాలి వేగం గంటకు 6నుంచి 8కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. తదుపరి 48గంటల్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని కేశవరంలో 18.3 మి.మి వర్షం కురిసింది. పంగిడిలో 11.5, మేళ్లచెరువులో 11, ఉట్నూర్‌లో 8.3, కోట్గిరిలో 7, గద్వాల్‌లో 6.8, పెంబిలో 6.3, రెడ్డిపల్లిలో 6, రాంజల్‌లో 6, జైనూర్‌లో 5.5, ఆత్మకూర్‌లో 4.8, జానంపేటలో 4.3 మి.మి వర్షం కురిసింది. రాష్టంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలిక పాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News