Monday, April 29, 2024

వ్యాక్సిన్ పంపిణీలో భారత్ రికార్డ్… 200 కోట్ల డోసుల పంపిణీ

- Advertisement -
- Advertisement -

India Covid-19 Vaccinations Hit 200 Crore Mark

దేశ ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 18 నెలల్లోనే 200 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీలో భారత్ మైలు రాయిని దాటి రికార్డు సృష్టించింది. 2021 జనవరి 16న టీకా పంపిణీ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు దేశ వ్యాప్తంగా 2,00,00,15,631 డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఘనతపై ప్రధాని మోడీ స్పందించి భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందన్నారు. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ ఇదెంతో గర్వకారణమన్నారు. కరోనా మహమ్మారిపై యావత్ ప్రపంచం సాగిస్తున్న పోరాటానికి భారత్ సాధించిన ఘనత మరింత బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు అర్హులైన వారిలో 98 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారు. 90 శాతం అర్హులకు పూర్తి మోతాదులో రెండు డోసులు అందాయి. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 51.5 శాతం పురుషులు కాగా, 48.9 శాతం మంది మహిళలు. వంద కోట్ల మైలురాయిని దాటడానికి 9 నెలలు పట్టగా, మరో 9 నెలల్లో 200 కోట్ల మార్కును చేరుకోవడం విశేషం. గత ఏడాది సెప్టెంబర్ 17న ఒకేరోజు 2.5 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది.

దేశంలో మూడో డోసు పంపిణీ ఈ ఏడాది జులై 15న ప్రారంభమైంది. ఇప్పటివరకు 5 కోట్ల 63 లక్షల డోసులు పంపిణీ చేశారు. ప్రికాషనరీ డోసు పేరుతో ఇస్తోన్న బూస్టర్ డోసును మొదట ప్రైవేట్‌లో అందుబాటులో ఉంచగా, తాజాగా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తోంది. రెండు, మూడు డోసుల మధ్య వ్యవధి తొలుత తొమ్మిది నెలలుండగా, ప్రస్తుతం దాన్ని 6 నెలలకు తగ్గించారు. ప్రపంచంలో 184 దేశాల్లో ఇప్పటివరకు 1225 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో చైనా, భారత్‌లు ముందుండగా, ఈయూ, అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News