సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారీ ఎత్తున బలగాల తరలింపు
యుద్ధ ట్యాంకులతో చైనాకు దీటుగా భారత్ సన్నద్ధం
నిత్యం అప్రమత్తంగా ఉండండి, కేంద్ర బలగాలకు కేంద్ర హోంశాఖ అదేశాలు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను హోం శాఖ బుధవారం ఆదేశించింది. డ్రాగన్ సైన్యం హద్దు మీరితే బుద్ధిచెప్పేందుకు భారీఎత్తున దళాలు, ట్యాంకులతో సన్నద్ధమైంది. ఇరు పక్షాలు ఎల్ఏసి వద్ద పెద్దసంఖ్యలో మోహరించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండో-చైనా, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అత్యంత జాగరూకతతో (హైఅలర్ట్) ఉండాలని హోం శాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో నిఘా, పెట్రోలింగ్ పెంచాలని ఇండో టిబెటెన్ బోర్టర్ పోలీసు (ఐటిబిపి), సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బి) హోం శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సరిహద్దుల్లో అప్రమత్తతను కొనసాగించాలని ఐటిబిపిని హోం శాఖ ఆదేశించింది.
దీనితో పాటు, ఇండో-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్లోని కాలాపాని ప్రాంతంలో నిఘా పెంచాలని కూడా ఎస్ఎస్ని, ఐటిబిసిలకు ఆదేశాలిచ్చింది. హోం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎన్ఎస్బికి చెందిన పలు కంపెనీలను ఇండియా-నేపాల్ సరిహద్దుకు తరలించారు. ఇంతకుముందు ఈ బలగాలను జమ్మూకశ్మీర్, ఢిల్లీలో మోహరించారు. హోం మంత్రిత్వ శాఖ, సరిహద్దు నిర్వహణ కార్యదర్శి, ఐటీబీపీ, ఎస్ఎస్బీ అధికారులు మంగళవారం జరిపిన సమీక్షా సమావేశంలో బలగాల తరలింపు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఏసీ వెంబడి భారత భూభాగంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలను అక్కడి నుంచి కదలవద్దని కూడా ఆదేశాలు జారీ అయినట్టు అధికారులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాలను మార్చేందుకు చైనా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పలు ’వ్యూహాత్మక హైట్స్’లో భారత ఆర్మీని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ లేక్ చుట్టూ కీలక పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. కాగా, మంగళవారం ఓ వైపు మిలటరీ చర్చలు జరుగుతుండగానే చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది.
Indian Army foils china attempts to change LAC Status