‘సామ్నా’లో శివసేన ప్రశంసలు
ముంబయి: ఉత్తర్ ప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాకాండలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధించడంపై శివసేన మండిపడింది. ప్రియాంక గాంధీ కూడా తన నాయనమ్మ ఇందిరా గాంధీ తరహాలోనే పోరాట స్ఫూర్తి ఉన్న నాయకురాలంటూ శివసేన ప్రశంసించింది. లఖీంపూర్ ఖేరీకి వెళుతున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని లక్నో విమానాశ్రయంలో నిలిపివేయడాన్ని ప్రస్తావిస్తూ ఇదేమైనా భారత్-పాకిస్తాన్ శత్రుత్వమా అని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో యుపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భారతదేశంలోని ఫెడరల్ వ్యవస్థలో ఇదో విచిత్రమైన పరిస్థితంటూ సేన వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినందున ప్రియాంక గాంధీపై రాజకీయంగా దాడి జరిగే అవకాశం ఉందని, అంతేగాక ఆమె దేశం కోసం గొప్ప త్యాగాలు చేయడంతోపాటు పాకిస్తాన్ను విభజించిన(బంగ్లాదేశ్గా) మహానేత ఇందిరా గాంధీ మనవరాలని, ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేసిన వారు ఈ వాస్తవాలను గ్రహించాలని సామ్నా వ్యాఖ్యానించింది. యుపి ప్రభుత్వం ప్రియాంకను అడ్డుకోవడమేకాక ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిందని సేన ఆరోపించింది. మహారాష్ట్రలో ఇదే ఏ బిజెపి మహిళా నాయకురాలి పట్ల అయినా జరిగి ఉంటే ఆ పార్టీ తన మహిళా కార్యకర్తలతో నానా రచ్చ చేసి ఉండేదని సేన విమర్శించింది. మహిళల పట్ల వ్యవహరించే విషయంలో బిజెపికి సొంత భాష్యాలు ఉంటాయని, ఆ పరిధిలో ఇందిరా గాంధీ మనవరాలు ఉండదని శివసేన ఎద్దేవా చేసింది.