మనతెలంగాణ, హైదరాబాద్ : తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్, వినాయక్నగర్కు చెందిన బాలరాజుకు, హేమలత దంపతుల కూతురు సాయికృప(17) ఇంటర్ రెండో సంవత్సరం చేస్తోంది. బాలరాజు ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, తల్లి హేమలత అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. గత కొంత కాలం నుంచి సాయికృప కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతోంది. ఆస్పత్రికి వెళ్దామని తల్లిదండ్రులు చెబితే తనకు భయం అంటూ వెళ్లేందుకు ఇష్టపడేది కాదు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం మరోసారి కడుపునొప్పి వస్తోందంటూ సాయికృప తండ్రికి చెప్పింది.
తండ్రి ఆగ్రహంతో కడుపునొప్పి వస్తుందంటావు ఆస్పత్రికి రావని అన్నాడు. కడుపునొప్పి అంటూ తనను విసిగించవద్దని కసురుకున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లి డోర్వేసుకున్న కూతురు ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి తల్లి హేమలత లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల ఉన్న వారి సాయంతో కిందికి దించి అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. బాలిక తండ్రి బాలరాజు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.