Monday, April 29, 2024

భయపెట్టాలనే బిబిసిపై దాడులు

- Advertisement -
- Advertisement -

‘చైనా నుంచి బిబిసి డబ్బులు తీసుకుందా?” అంటూ వార్తా విశ్లేషణ కోసం రిపబ్లికన్ టివిలో ఫ్లాష్ న్యూస్ వస్తోంది. లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే ఈ ఛానల్‌లో ఆర్నబ్ గోస్వామి కనిపిస్తున్నారు. “లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, మనం ఏదైతే దారుణమని అనుమానించామో, అది పచ్చి నిజమని తేలింది. బిబిసికి చైనా నిధులు ముట్టాయి” నుదుటపై పడుతున్న జుట్టును పైకి లాక్కుంటూ అరిచారు అర్నబ్. ఇది జరిగిన రెండునెలల తరువాత, ఓ మంగళవారం 50 మందికి పైగా ఆదాయపన్ను శాఖాధికారులు ఢిల్లీ, ముంబైలలోని బిబిసి కార్యాలయాల్లోకి ప్రవేశించారు. ఆ అధికారులు 3 రోజుల పాటు తమ ఫైళ్ళన్నీ వెతికారని, ఇమెయిల్స్, ఫోన్‌లు, ల్యాబ్‌టాప్‌లలోని సమాచారాన్నంతా కాపీ చేసుకున్నారని అక్కడ ఉన్న బిబిసి ఉద్యోగులు తెలిపారు. పన్నులకు సంబంధించిన సమాచారం పూర్తిగా సేకరించేవరకు అయిదుగురు సీనియర్ ఎడిర్లతో పాటు, పది మంది ఉద్యోగులను శుక్రవారం వరకు బైటికి పోనీయలేదు.

ఇవ్వన్నీ సాధారణంగా జరిగే పరిశీలనేనని ప్రభుత్వం ప్రకటించింది. “ఆదాయ పనున్న శాఖ చేసిన పరిశీలనకు, బిబిసి ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదానికి ఎలాంటి సంబంధం లేదు”అని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ సలహాదారు కంచన్ గుప్త ప్రకటించారు. “ఇదేమీ దాడులు చేయడమో, స్వాధీనం చేసుకోవడమో కాదు, కేవలం పరిశీలనే. బిబిసి డాక్యుమెంటరీ విడుదల చేయడానికి ముందే కొన్ని విషయాలు స్పష్టం చేయమని పది నోటీసులిచ్చాం. వాటికి బిబిసి స్పందించలేదు. ఫలితంగా ఈ పరిశీలన చేయాల్సి వచ్చింది. ఈ పరిశీలనలో అనేక అవకతకలు, వ్యత్యాసాలు బైటపడ్డాయి” అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ విచారణకు తాము సహకరించామని బిబిసి తెలిపింది. బిబిసిపైన ఈ దాడులు జరుగుతున్నప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత దేశంలో పత్రికా స్వేచ్ఛపై బెదిరింపులు, అధికారిక పెత్తనం సాగుతోందని అనేక మంది పరిశీలకు భావిస్తున్నారు. మోడీ గురించిన ఒక డాక్యుమెంటరీని జనవరిలో బిబిసి బ్రిటన్‌లోనే ప్రసారం చేయడం పట్ల భారత ప్రభుత్వం దానిపట్ల వ్యతిరేకత వ్యక్తం చేసింది.

‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అన్న పేరుతో రెండు భాగాలుగా విడుదలైన ఈ డాక్యుమెంటరీ మోడీ హిందూ జాతీయ ప్రభుత్వానికి, అల్పసంఖ్యాకులైన ముస్లిం జనాభాకు మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్నాయని ఆరోపించింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో ఆ రాష్ర్టంలో జరిగిన మతఘర్షణల్లో వందలాది మంది ముస్లింలు మరణానికి దారి తీసిన పరిస్థితికి మోడీ సహకరించారని ఆ డాక్యుమెంటరీ చెప్పడం తీవ్ర వివాదాస్పదమైంది.ఈ డాక్యుమెంటరీ బ్రిటన్ దౌత్య కేబుల్‌లో గతంలో ప్రసారం కాకపోయినప్పటికీ, ఏళ్ళ తరబడి మోడీని వెంటాడుతున్న ఈ ఆరోపణలు ఇప్పుడేమీ కొత్తకాదు. తన పైన వచ్చిన ఈ ఆరోపణలన్నిటిపైన 2012లోనే సుప్రీంకోర్టు నుంచి క్లీన్ చిట్ తీసుకున్నారు.ఈ డాక్యుమెంటరీ భారతదేశంలో తయారైంది కాదు. కానీ ప్రభుత్వం బిబిసిపైన ఆరోపిస్తూ ఇది ‘వలసవాద ప్రచారం’ అని ‘పరస్పర విరుద్ధమైన చెత్త’ అని, భారత దేశం ఒక బలీయమైన ప్రపంచ శక్తిగా ఎదగడం ఇష్టంలేని పశ్చిమ దేశాలు, మన దేశాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది.

అత్యవసర చట్టాలను వెలికితీసి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్ పంపిణీ కాకుండా చర్యలు చేపట్టింది. బిబిసి అవినీతికి పాల్పడేసంస్థ అని హిందూత్వ అనుకూల సామాజిక మాధ్యమాల్లో ఒక విద్వేష ప్రచారం మొదలైంది. భారత దేశానికి వ్యతిరేకమైన చైనా నుంచి ఈ బిబిసికి నిధులు అందాయని ఆరోపించారు.చైనాకు చెందిన హువాయ్ కంపెనీ నుంచి వాణిజ్య ప్రకటనల రూపంలో బిబిసి ముడుపులను స్వీకరించిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు వెలువడిన వెంటనే భారత వ్యతిరేక ప్రచారాన్ని చేయడానికి బిబిసికి చైనా నిధులు సమకూరుస్తోందని భారత దేశంలోని పెద్ద పెద్ద వార్తా ఛానెళ్ళు కూడా చర్చలు మొదలు పెట్టాయి. దీంతో బిజెపి శ్రేణులు కూడా అందుకున్నాయి. “ఇదొక విధానం. అంతకు ముందు దీన్ని చాలా సార్లు చూశాం’ అని భారత దేశానికి చెందిన జర్నలిస్టు రఖిబ్ హమీద్ నాయక్ అన్నా రు. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు భావ వ్యక్తీకరణ, పత్రికా స్వేచ్ఛ గొంతు నులిమేసి, రాజ్యాంగాన్ని స్తంభింపచేసి అనేక మంది జర్నలిస్టులను జైళ్ళలో కుక్కిన చరిత్ర భారత దేశానికుంది. మోడీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఒక పద్ధతి ప్రకారం విమర్శనాత్మక వార్తలు రాకుండా పత్రికల నోళ్ళు మూయించారని కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు.

అలా రాసే జర్నలిస్టులే ధ్యేయంగా వారిని ‘జాతి వ్యతిరేకుల’ని, వారి వల్ల ప్రభుత్వానికి ముప్పు వాటిల్లుతుందని ప్రచారం మొద లు పెట్టారు.ఈ ఏడాది పత్రికాస్వేచ్ఛ జాబితాలో 180 దేశాలకుగాను ఎన్నడూ లేని విధంగా భారత దేశం 150వ స్థానానికి దిగజారింది. ప్రభుత్వం పత్రికలను అణచివేస్తోందనే వాదనను కేంద్ర సమాచార శాఖ అధికార ప్రతినిధి కంచన్ గుప్త తిరస్కరించారు. ‘వాస్తవానికి పత్రికలను భయపెడుతున్నామన్నది నేను ఎక్కడా చూడలేదు. పత్రికా కార్యాలయాలు ప్రభుత్వ పరిశీలనకు అతీతం కాదు. పన్ను చెల్లించే చట్టాలు వారికి కూడా సమానంగా వర్తిస్తాయి” అన్నారు. భారత దేశంలో పెద్ద ఎత్తున ఉన్న పత్రికలు, వార, మాస, పక్ష పత్రికలు, డిజిటల్ మీడియా, టెలివిజన్‌లలో వాస్తవ దృశ్యాలను చైతన్యవంతంగా ప్రసారం చేయవలసి ఉంది. వీటిలో ప్రధాన స్రవంతిలో ఉన్న చాలా వాటి ప్రయోజనాలు బిజెపి ప్రభుత్వంతో ముడిపడి ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల చేతిలో ఉన్నాయి. ఇలాంటి పత్రికలు, చానెళ్ళు మోడీకి, బిజెపి పాలనకు అనుకూలంగా ఉన్న వారిపై వ్యతిరేక కథనాలను ప్రసారం చేయలేక, ముద్రించలేక పోతున్నాయి. “ప్రభుత్వానికి సంతోషం కలించడానికి రాజీపడిపోయిన విస్తృతమైన పత్రికలు, టెలివిజన్ చానళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నాయి’ అని న్యూస్‌లాండరీ అనే డిజిటల్ వార్తా సంస్థ సిఇఒ అభినానంద్ సెక్రి అన్నారు.

డిజిటల్ మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వం నిరంకుశమైన చట్టాలను ప్రవేశ పెడుతోందని విమర్శకుల ఆరోపణ. ఏవి తప్పుడు వార్తలు, ఏవి కావోనని విచారించి, నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వానికి ఈ చట్టాలు కట్టుబెడుతున్నాయంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రచురణ సంస్థలను దెబ్బ తీయాలనే ధ్యేయంతో ఉందని, ఇందులో భాగం గా అంతర్జాతీయ మీడియా పైన జరిగిన దాడిలో బిబిసి పైన జరిగింది తొలి దాడి. భారత దేశంలో పనిచేయడానికి విదేశీ విలేకరులకు వీసా మంజూరు చేయడంలో అడ్డంకులు సృష్టించడంతో పాటు సున్నితమైన ప్రాంతాలలో వారు పర్యటించడానికి కూడా ఆంక్షలు ఉన్నాయి. బిబిసి పైన దాడులు మొదలవ్వగానే, దాని పైన బిజెపి విమర్శలు రెట్టింపయ్యాయి. బిబిసి “ప్రపంచంలో అంత్యంత అవినీతి సంస్థ’ అని బిజెపి అధికార ప్రతినిధి గౌతం భాటియా ఆరోపించగా, ‘చెడ్డ పనుల కోసమే ఏర్పడిన సంస్థ’ అని బిజెపి సభ్యుడు, ఉపరాష్ర్టపతి జగ్దీప్ ధంకర్ ఆరోపించారు. బిబిసి కార్యాలయాలపైన ప్రభుత్వ దాడులు అభినానంద్ సెక్రిని ఆశ్చర్యపరిచాయి. డిజిటల్ మీడియాలో భాగంగా ఆయన నిర్వహించే న్యూస్‌లాండ్రీ చిన్నదైనా ప్రభుత్వంతో లాలూచీ పడేది కాదు కనుకనే 2001లో ఆయన కార్యాలయంపై రెండు సార్లు ఇన్‌కంటాక్స్ అధికారుల దాడులు జరిగాయి. ‘మేము ప్రసారం చేసే వార్తల పట్ల ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అసంతృప్తిగా ఉంటుందో ఇన్‌కంటాక్స్ వంటి ఏజెన్సీలతో భయపెడుతుంది’ అని అన్నారు.

ఇన్‌కంటాక్స్ దాడుల తరువాత కూడా న్యూస్‌లాండరీపైన వేధింపులు ఆగలేదు. అభినానంద్ సెక్రి పైన క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా, మీ డాక్యుమెంట్లు సమర్పించాలని ప్రతి రెండు నెలల కొకసారి ఇప్పటికీ ఆదాయ పన్నుల శాఖ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. ‘దేని కోసం వారు విచారిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా వార్తలు ఒక ప్రవాహం లాంటివి. మేం రాసే వాటిలో ఏ మార్పూ ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు. కీలకమైన వార్తలను ప్రసారం చేసినందుకు నిరంకుశమైన చట్టాల కింద తమని ప్రాసిక్యూట్ చేస్తారని జర్నలిస్టుల్లో ఒక భయం పట్టుకుంది. ‘ద వైర్’ వంటి న్యూస్ వెబ్‌సైట్లు, ‘కారవాన్’ వంటి పత్రికలు కీలకమైన వార్తలు ప్రసారం చేసినందుకు, రాసినందుకు కేసులు పెట్టారు. మహమ్మద్ జుబీర్ అనే జర్నలిస్టుకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో తొలుత ప్రసారం చేసి, తరువాత ఆయనను అరెస్టు చేసి, నిర్బంధించారు. సిద్ధికి కప్పన్ అనే కేరళకు చెందిన జర్నలిస్టును రెండేళ్ళు జైల్లో నిర్బంధించాక ఈ ఏడాదే బెయిల్ మంజూరైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక మైనర్‌పై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను చంపేసిన సంఘటనకు సంబంధించి వార్తను ఇవ్వడానికి కేరళ నుంచి వెళ్ళిన సిద్ధికి కప్పన్‌ను టెర్రరిస్టు చట్టాల కింద అరెస్టు చేశారు.

రెండేళ్ళ క్రితం అతన్ని అరెస్టు చేసినప్పటికీ ఇప్పటి వరకు విచారణే మొదలు పెట్టలేదు. వార్తల రిపోర్టింగ్ ద్వారా అతను మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని ప్రభుత్వ ఆరోపణ. తనపై రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని సిద్ధికి కప్పన్ ఆరోపణ. “ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కీలకమైన వార్తలను రాశానని నాపై కక్ష కట్టారు. భారత దేశంలో స్వతంత్రంగా వ్యవహరించే జర్నలిస్టుల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా దిగజారుతున్నాయి. నాకు జరిగిన దాన్ని ఇతరులకు ఒక హెచ్చరిక లాగా భావిస్తున్నారు’ అని సిద్ధికి కప్పన్ అంటున్నారు. మోడీ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకంటే కశ్మీర్‌లోనే ఎక్కువగా పత్రికారంగాన్ని అణచివేస్తోంది.దశాబ్దాలుగా స్వయం ప్రతిపత్తిని అనుభవిస్తున్న ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్‌లో 2019 నుంచి 18 నెలల పాటు ఇంటర్‌నెట్‌ను నిలిపివేసింది. ఫలితంగా పత్రికా కార్యాలయాలు పూర్తిగా అణచివేతకు గురయ్యాయి. నియంతృత్వ చట్టాల కింద అరెస్టయిన ముగ్గురు జర్నలిస్టులు ఇప్పటికీ జైళ్ళలోనే మగ్గుతున్నారు.

మరికొంత మందిని నిర్బంధించి, తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసి, పోలీసులు విచారించారు. విదేశాలకు వెళ్లకుండా వారిపై ఆంక్షలు విధించారు. గత ఏడాది రాష్ర్ట ప్రెస్ క్లబ్‌ను మూసేశారు. ‘మాకు 2019కి ముందు కూడా ఇబ్బందులు ఉన్నాయి కానీ, ఇంత దారుణంగా లేవు. ఒక పద్ధతి ప్రకారం జర్నలిస్టులను అణచి వేస్తున్నారు. స్థానిక పత్రికల్లో ఒక్కటంటే ఒక్క కీలకమైన కథనం రాయడానికి వీలులేని వాతావరణాన్ని కల్పించారు. మొదటి పేజీలు ప్రభుత్వానికి ప్రచారం చేసే కరపత్రాల్లా కనిపిస్తున్నాయి. సెన్సార్‌షిప్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది’ అని కశ్మీరి టైవ్‌‌సు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురుధ్ బాసిన్ అన్నారు. ‘భారత దేశంలో పత్రికల నోళ్ళు శాశ్వతంగా మూయించడానికి కశ్మీర్ ఒక ప్రయోగశాలలా తయారైంది. ఈ పరిస్థితి దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది చాలా ఆందోళన కరమైన పరిస్థితి” అని భాసిన్ వ్యాఖ్యానించారు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News