మోడీ తీరుపై ఝార్ఖండ్ సిఎం విమర్శలు
న్యూఢిల్లీ: కొవిడ్ పరిస్థితిపై తాము చెప్పేది వినకుండా ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ మన్ కీ బాత్ తరహాలా సాగిందని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్ విమర్శించారు. ప్రధాని కేవలం తన మనసులో ఉన్న మాటల్ని మాత్రమే బయటపెట్టారని, తాము చెప్పే అంశాల్ని కూడా విని ఉంటే బాగుండేదని సోరెన్ తెలిపారు. ఈమేకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రధాని తీరును తప్పు పట్టారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ గురువారం ఆయా ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి ఆరా తీశారు.
ఝార్ఖండ్ సిఎంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా సిఎంలతోనూ ప్రధాని మాట్లాడారు. అయితే, ప్రధాని తనతో ఫోన్లో మాట్లాడిన తీరుపై సోరెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక కరోనా మరణాలు(75 శాతం) సంభవిస్తున్న పది రాష్ట్రాల్లో ఝార్ఖండ్ ఒకటి. గురువారం ఝార్ఖండ్లో 133మంది చనిపోయారు. దీంతో, ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 3479కి చేరింది. కొత్తగా 6974 కేసులు నమోదయ్యాయి. దాంతో, కేసుల సంఖ్య 2,70,089కి చేరింది. మరణాల రేట్ 1.28 శాతంగా నమోదైంది. జాతీయ సగటు 1.09 శాతంకన్నా ఇది ఎంతో అధికమన్నది గమనార్హం. ఝార్ఖండ్లో రికవరీ రేట్ 76.26 శాతం కాగా, జాతీయ సగటు 82 శాతం.