Saturday, April 27, 2024

దళితుల పోరాట యోధుడు

- Advertisement -
- Advertisement -

యుగయుగాలుగా, తరతరాలుగా భారత దేశాన్ని పీడిస్తున్న సమస్య హక్కుల వివక్ష. దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తి చేయడానికి ఎందరో మహానుభావులు తమదైన శైలిలో ఎన్నో ఉద్యమాలు చేశారు. వారిలో ప్రముఖులు జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహూ మహారాజ్, పెరియార్ ఇవి రామస్వామి నాయకర్, నారాయణ గురు, అంబేడ్కర్ వంటి వారు దేశాన్ని కుల వివక్ష నుంచి విముక్తిపరచుటకై ఎన్నో అధ్యయనాలు చేశారు.వీరి బాటలోనే నడిచిన మరో ప్రముఖ సామాజిక రాజకీయ వేత్త కాన్సీరామ్. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ బలమైన రాజ్యాంగాన్ని రచించినప్పటికీ రాజ్యాధికారాన్ని ఉన్నత కులాలవారు మాత్రమే చెలాయిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు వారైనా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాల వారు 85% వున్నప్పటికీ వారు ఓటర్ లాగే మిగిలిపోతున్నారు కానీ పరిపాలనలో భాగస్థులు కావడం లేదు అనే ఉద్దేశంతో, క్రింది కులాల వారికి రాజ్యాధికారం దక్కాలని ఉద్దేశంతో ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడు కాన్షీరాం. కాన్షీరామ్(1934-2006) ప్రముఖ రాజకీయ నాయకుడు,

దళితుల హక్కుల ఛాంపియన్, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) స్థాపకుడు. దళితుల రాజకీయ శక్తిని సమీకరించడానికి, సామాజికన్యాయం సాధించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 1934లో పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్పూర్‌లో జన్మించారు. 1970 లో రాం మనోహర్ లోహియా స్థాపించిన సోషలిస్ట్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రామ్ మనోహర్ లోహియా విధివిధానాలు నచ్చక 1970 సంవత్సరంలో బహుజన సమాజ్ అనే సంస్థను స్థాపించారు. 1984 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు. బహుజన సమాజ్ పార్టీ ద్వారా దళితులలో వెనుకబడిన వర్గాలలో, ముస్లింలలో రాజకీయ చైతన్య నింపారు. కాన్షీరాం బహుజన్ సమాజ్ సిద్ధాంతం ప్రకారం భారతీయ సమాజం హిందువులు, ముస్లిం అనే రెండు వర్గాలుగా విభజించబడలేదు, బహుళ జాతి సమాజంగా విభజించబడింది.బహుజనులు అంటే దళితులు, ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాలు భారతీయ జనాభాలో ఎక్కువ మందిని కలిగి ఉన్నారు.

అంటే 85% మంది రాజ్యాధికారానికి దూరం అవుతున్నారు. వారిని రాజకీయ చైతన్యంతో , రాజ్యాధికారం చేపట్టే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగిందని అనేక ప్రసంగాల్లో కాన్షీరామ్ తెలియజేశారు. 1993లో ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి కీలక పాత్ర పోషించింది. ఆ సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికలలో బిఎస్‌సి 67 స్థానాలు గెలుచుకొని ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 1995లో కాన్షీరామ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాన్షీరామ్ సామాజిక న్యాయం కోసం పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాయావతిని కాన్షీరామ్ తన రాజకీయ వారసురాలుగా ఎంచుకున్నారు. మాయావతి నేతృత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి దళిత హక్కుల కోసం పోరాటం కొనసాగించింది. దళితుల ఓట్లను ఒకే తాటిపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. బిఎస్‌పిని భారత దేశంలోని ప్రధాన రాజకీయ శక్తులలో ఒకటిగా మార్చారు.

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బిఎస్‌పి అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. దళితుల రాజకీయ శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక న్యాయం కోసం పోరాడే రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. బిఎస్‌పిని దళితుల రాజకీయ పార్టీగా స్థాపించారు. పార్టీ రాజ్యాంగంలో ‘బహుజన సమాజ్’ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దళితులతో పాటు ముస్లింల మద్దతును కూడా పొందేందుకు కృషి చేశారు. కాన్షీరామ్ భారతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. 2006లో కాన్షీరామ్ మరణించినప్పటికీ ఆయన భావాలు, బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కాన్షీరామ్ రాజకీయాల్లో బహు జనులకు వేసిన పెద్ద పీట బహుజన సమాజ్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా బహుజనులు తమదైన శైలిలో చైతన్యవంతులవుతున్నారు. నేడున్న ప్రాంతీయ పార్టీలు అత్యధికం అగ్రవర్ణాల వారి చేతిలో ఉండటం,

బహుజనులకు ఎన్నికలలో ఆ పార్టీలు సీట్లు కేటాయించకపోవడం, ఇంకా బహుజనులలో రాజకీయ పరమైన చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే వెనుకబడిన దళిత, ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని కాంక్ష రావడం, కొంత మంది సమాజ్ పార్టీ వైపు అడుగులు వేయడం గర్వకారణంగా చెప్పవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News