Sunday, April 28, 2024

అప్పుడు కెసిఆర్‌ను ఎన్ కౌంటర్ చేస్తారనుకున్నా: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చరిత్ర మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. కెసిఆర్ ఆమరణ దీక్ష తీసుకున్న రోజు ఇవాళ అని, దీక్షకు సిద్దిపేట కేంద్రం అని గుర్తు చేశారు. ఐతే తెలంగాణ జైత్ర యాత్ర.. లేదంటే తన శవయాత్ర గా దీక్ష చేపట్టారని ప్రశంసించారు. ఢిల్లీ మేడలు వంచి తెలంగాణ ఆకాంక్షలు నిజం చేసిన రోజు అని కొనియాడారు. సిద్దిపేటలో ఆమరణ నిరహార దీక్ష కోసం వస్తుంటే కరీంనగర్ అలుగునూరు లో కెసిఆర్ ను ఆరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారని, ఖమ్మం జైల్లో కెసిఆర్ తన దీక్ష కొనసాగించారని మెచ్చుకున్నారు. కెసిఆర్ పై నాటి సమైక్య పాలకులు అనేక కుట్రలకు పాల్పడ్డారన్నారు. కెసిఆర్ ఆరోగ్యం క్షిణిస్తుంటే, కెసిఆర్ ను హైదరాబాద్ కు తరలించే క్రమంలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చారన్నారు. దీక్ష 9, 10 రోజున కెసిఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, అసలు ఎం జరుగుతుందో అనే ఆందోళన చెందామన్నారు. కెసిఆర్ దీక్షతో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు.

తెలంగాణ టాగ్ లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు నిజమైందంటే నాటి కెసిఆర్ పోరాటమే కారణమని ప్రశంసించారు. కెసిఆర్ ఆరోగ్యం క్షీణిస్తుంటే ప్రజలు అంతా ఏకమయ్యారని, ఎక్కడి కక్కడ ఆందోళనలు చేశారని, నాడు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి మెదక్ పోలీస్ స్టేషన్ కు తరలించారన్నారు. అలుగునూర్ లో కెసిఆర్ అరెస్ట్ చేసి ఖమ్మం వైపు తీసుకెళ్తూ ఉంటే కెసిఆర్ ను ఎక్కడ ఎన్ కౌంటర్ చేస్తారో అన్న భయం వేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకపోతే ఈ బలిదానాలు జరిగి ఉండేవి కావని, విద్యార్థులు బలయ్యే వారు కాదన్నారు. కెసిఆర్ అరెస్టుతో తెలంగాణ ఉద్యమం విస్పోటనంగా మారిందన్నారు. కెసిఆర్ దీక్ష లేక పోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్నారు. నేటి తెలంగాణ సాకారానికి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడానికి కెసిఆర్ దీక్షనే కారణమని హరీష్ రావు కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News