న్యూఢిల్లీ : పంజాబ్లో అర్హితియాలు (కమిషన్ ఏజెంట్లు)పై ఆదాయపు పన్ను శాఖ దాడులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. వారి ఇళ్లల్లో సోదాలకు దిగడం, నోటీసులు వెలువరించడం వంటివి కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలలో భాగమేనని విమర్శించారు. ఢిల్లీ శివార్లలో రైతుల ఉద్యమానికి ఈ దళారులు డబ్బులు ఇతరత్రా సాయం చేస్తున్నారనే కేంద్రం ఐటి ఆయుధాన్ని ప్రయోగించిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. పంజాబ్ వ్యాపారుల నుంచి రైతాంగానికి భారీ స్థాయిలో డబ్బులు అందుతున్నాయనే సాకుతో వారిని వేధించడం, ఐటి దాడులకు పురికొల్పడం వంటివి దారుణ చర్యలని విమర్శించారు. ఐటి దాడులు కలవరం కల్గిస్తున్నాయని, ఈ సందర్భంగా తమ ట్వీట్లో పంజాబ్ పత్రికలలో వచ్చిన వార్తలను కేజ్రీవాల్ జతచేశారు. రైతుల ఉద్యమాన్ని బలహీనపర్చేందుకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని, దాడులు, సోదాలు చేపడుతున్నారని, ఇప్పుడు దేశమంతా రైతులకు బాసటగా నిలుస్తోందని, మరి కేంద్రం దేశమంతటిపై దాడి జరుపుతుందా? అని వ్యాఖ్యానించారు.