ఉదయం 6గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంటవరకు వెసులుబాటు
ఏడు గంటలు వ్యవధిలో అమ్మకాలు సాగతాయంటున్న వ్యాపారులు
కోవిడ్ పాటించాలని వ్యాపారులకు అధికారులు సూచనలు
నిర్లక్ష్యం చేస్తే మళ్లీ వైరస్ రెక్కలు కట్టుకుంటుందన్న వైద్యులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. మొదటిసారి లాక్డౌన్లో నాలుగు గంటలపాటు సడలింపు ఇవ్వడంతో పెద్దగా ప్రయోజనం కలిగించలేదని చిరు వ్యాపారులు పేర్కొన్నారు. స్దానికంగా ఉండే రాజకీయ నేతలు రెండోసారి మంత్రివర్గ సమావేశంలో సడలింపు సమయం పెంచేలా చూడాలని కోరడంతో ఆదివారం జరిగిన క్యాబినేట్ సమావేశంలో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ సడలింపు సమయం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట సడలిస్తూ మరో గంట పాటు వ్యాపారులు ఇంటికి చేరుకునేందుకు గడువు ఇవ్వడంతో నగర పోలీసులు లాక్డౌన్ను కఠినంగా మద్యాహ్నం 2 గంటల నుంచి అమలు చేయనున్నారు.
గ్రేటర్లో కూరగాయలు, పండ్లు, కిరాణదుకాణాలు, స్టేషనరీ, ఆన్లైన్ కేంద్రాలు, తోపుడు బండ్ల వ్యాపారులకు ఊరట ఇచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 07 గంటల పాటు వ్యాపారం నడిపిస్తే కనీసం రోజుకు రూ. 500వరకు సంపాదిస్తామని, దీంతో కుటుంబం పోషణ చేస్తామని పేర్కొంటున్నారు. మొన్నటివరకు ఉన్న సడలింపుతో రావడానికి, తిరిగి వెళ్లడానికి గంటన్నర సమయం గడిచేదని, దీంతో రెండు గంటలు వ్యాపారంతో అమ్మకాలు సాగక, కూరగాయలు, పండ్లు కుళ్లిపోవడంతో అనేక నష్టాలు ఎదుర్కొన్నామని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. నగరంలో ప్రధానంగా మోండమార్కెట్, గుడిమల్కాపూర్, మాదన్నపేట, బోయినపల్లి, కొత్తపేట, ఎన్టీఆర్నగర్, వనస్దలిపురం రైతుబజార్లలపై రోజుకు 1.20లక్షలమంది చిరువ్యాపారులు ఆధారపడి ఉన్నారు.
వీరంతా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి పూటగడవని రోజుల్లో ఉన్నాయని, తాజాగా ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో కొంతమేరకు వ్యాపారం సాగుతుందని దీంతో నష్టాలు లేకుండా దినసరీ కూలీ గిట్టుబాటుతో జీవితం గడుపుతామని పేర్కొంటున్నారు.అదే విధంగా వైద్యాధికారులు వ్యాపారులు తమ దగ్గరకు వచ్చేవారు ముఖానికి మాస్కులు, బౌతికదూరం పాటించేలా చూడాలని కోరుతున్నారు.మళ్లీ గుంపులుగా జనం ఒకదగ్గర చేరితే వైరస్ పుంజుకుంటుందని, కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ తమ విధులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. కోవిడ్ కట్టడికి ముందు వరుసలోఉన్న ఆరోగ్య, పోలీసు, మున్సిఫల్, రెవెన్యూ సిబ్బందికి వ్యాపారులు,స్దానిక ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.