మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగురాష్ట్రాలు ఇప్పటి వరకు చేసిన నీటి వినియోగాన్ని పరిశీలించి కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రకు నీటి కేటాయింపులు చేసింది. అయితే నాగార్జున సాగర్ 2019-2020 సంవత్సరాలకు ఉన్న క్యారీ ఓవర్ స్టోరేజీ నుంచి 7.746 టిఎంసిల నీటిని వినియోగించుకుంటామని ఆంధ్రను తెలంగాణ కోరినా ఆంధ్రప్రదేశ్ నిరాకరించింది. ప్రతి సంవత్సరం కృష్ణా జలాల ప్రవాహ వేగం, ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలమేరకు ట్రిబ్యునల్ అవార్డులను అనుసరించి కృష్ణానదీ యాజమాన్యం బోర్డు నీటిని కేటాయిస్తోంది.
ప్రస్తుత నీటి వినియోగ సంవత్సరం మే 31తో ముగిసిపోగా తాజాగా నీటి కేటాయింపులు చేసింది. అయితే కేటాయింపుల మేరకు నీటిని వినియోగించుకోని పక్షంలో తిరిగి మరోసంవత్సరం ఉపయోగించుకోవద్దని ఎపి తిరకాసు పెట్టింది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ నుంచి గత కేటాయింపుల కంటే తక్కువగా తెలంగాణ ఉపయోగించుకోగా తాజా కేటాయింపుల్లో ఆ నీటిని ఉపయోగించుకుంటామని ఎపిని కోరితే ఎపి అంగీకరించలేదు. ఈ విషయంలో త్వరలో జరగనున్న కృష్ణానదీ యాజమాన్యబోర్డు త్రిసభ్యసమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు కార్యదర్శి ప్రకటించారు. అయితే మరో నిర్ణయం వచ్చేంతవరకు ప్రస్తుత తాజా కేటాయింపుల మేరకే కృష్ణానీటిని వినియోగించుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.
కృష్ణానదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృ-ష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కరుస్తుండటంతో వరద ప్రవాహ వేగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిడబ్లూసి హెచ్చరించింది. జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లకు ఒక్కటి రెండురోజుల్లో 75 శాతం మేర నీరు వచ్చే అవకాశం ఉందని సిడబ్లూసి హెచ్చరించింది.
Krishna River Board water allocations to TS and AP