Monday, April 29, 2024

మంత్రి కెటిఆర్ తో  సింగపూర్ హైకమిషనర్ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావుతో సింగపూర్ హైకమిషనర్  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…. మంత్రి కె తారక రామరావు హైదరాబాద్, తెలంగాణ గురించి వివరించారు. హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా  కాస్మోపాలిటన్ స్వభావంతో  అభివృద్ధి చెందుతూ వస్తుందని, ఇక్కడ అనేక రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు, వారి సిబ్బంది దీర్ఘకాలంగా పని చేస్తున్నారని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు, టిఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామని, తెలంగాణ కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా అంతర్జాతీయంగా నెలకొన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రపంచంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు పోటీ పడుతుందన్నారు. ఇక్కడ ఉన్న లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటి, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ వివరించారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన డిబిఎస్ వంటి కంపెనీలు, తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి మంచి అభిప్రాయాని వ్యక్తం చేశాయని హై కమిషనర్ కు మంత్రి కెటిఆర్ తెలిపారు. సింగపూర్ కంపెనీలు ఐటి, ఇన్నోవేషన్, ఐటి అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయని వాంగ్ తెలిపారు. హైదరాబాదులో ఉన్న టి హబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటి ఈకో సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించిన  సానుకూలతలు తెలుసుకున్నారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాలు పట్ల ఆసక్తితో ఉన్నాయని వాంగ్ తెలిపారు.

సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా సింగపూర్ పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కెటిఆర్ స్పష్టం చేశారు. మంత్రి కెటిఆర్ ప్రతిపాదించిన సింగపూర్ పెట్టుబడులకు ప్రత్యేకంగా హబ్ ఏర్పాటు చేస్తామనడం ఒక గొప్ప ఆలోచన అని వాంగ్ ప్రశంసించారు. గతంలో తాము కూడా ఇలాంటి  ప్రయత్నాలతో పెట్టుబడులను ఆకర్షించి, విజయవంతం చేశామని కెటిఆర్ కు వాంగ్ తెలిపారు. ఈ  సమావేశం ముగిసిన తరువాత హైకమిషనర్ సిమోన్ వాంగ్ పాటు, చెన్నైలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ లను కెటిఆర్ శాలువతో సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News